ఆంధ్రప్రదేశ్ మీదుగా వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.. హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు విశాఖపట్నం-హైదరాబాద్ రెండు రైళ్లు, విజయవాడ టు చెన్నై, విశాఖపట్నం టు దుర్గ్, విశాఖపట్నం టు భువనేశ్వర్, కాచిగూడ టు యశ్వంత్‌పూర్(బెంగళూరు) రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఈ రైళ్లు ఏపీలోని ఆయా రైల్వే స్టేషన్‌లలో ఆగుతున్నాయి. అయితే ఒకటి, రెండుచోట్ల వందేభారత్ రైళ్లకు అదనంగా హాల్ట్‌లు ఇవ్వాలని స్థానిక ఎంపీలు రైల్వే మంత్రిని అడుగుతున్నారు. రెండు నెలల క్రితం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ టు యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలును ఆపాలని కోరారు. రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను స్థానిక ఎంపీ బీకే పార్థసారథి రిక్వెస్ట్ చేయగా.. వెంటనే రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. హిందూపురంలో హాల్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. అయితే ఎప్పటి నుంచి రైలును ఆపుతారనేది క్లారిటీ లేకుండా పోయింది. రెండు నెలలుగా దీనిపై అప్డేట్ లేదు.. అయితే తాజాగా హిందూపురం ఎంపీ పార్థసారథి వందేభారత్‌ స్టాప్2పై క్లారిటీ ఇఛ్చారు. రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని చెప్పారు ఎంపీ బీకే పార్థసారథి. హిందూపురంలో పర్యటించారు. వందేభారత్ రైలుకు హిందూపురంలో స్టాప్‌పై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు రిక్వెస్ట్ చేశామన్నారు. హిందూపురంలో వందే భారత్‌ రైలును ఆపేలా చర్యలు తీసుకుంటామని అప్పుడే హామీ ఇచ్చారన్నారు. మరో పది రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. పది రోజుల్లో వందేభారత్ రైలు హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఆగుతుందని చెప్పుకొచ్చారు. హిందూపురం రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనుల్ని వేగవంతం చేశారని.. అలాగే బళ్లారి నుంచి మడకశిర మీదుగా రైల్వే ట్రాక్‌ పనుల్లో స్పీడ్ పెరిగిందన్నారు. చాకర్లపల్లి రైల్వే గేటు దగ్గర రూ.29 కోట్లతో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని.. ఏడాదిలోనే పూర్తవుతాయన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారని.. ఏకంగా రూ.92 కోట్లతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు ఎంపీ పార్థసారథి. హిందూపురం పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.