ఖాతాదారులకు SBI గుడ్‌న్యూస్.. ఇక నో టెన్షన్, అన్నిటికీ ఒకే KYC.. ఛైర్మన్ కీలక ప్రకటన

Wait 5 sec.

SBI KYC: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు భారీ ఉపశమనం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 చివరి నాటికి (మార్చి 2026 నాటికి) తమ అన్ని ఉత్పత్తులు, సేవలకు ఒకే కేవైసీ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (KYC) పోర్టల్ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకులోని అన్ని సేవలను సులభంగా పొందవచ్చు.ఎస్‌బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ఆ బ్యాంక్ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ 'కేవైసీని ఒక సేవగా (KYC as a service) అందిస్తాము' అని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్‌బీఐ కస్టమర్ కొత్తగా ఏ ఉత్పత్తి (కొత్త లోన్ లేదా పెట్టుబడి పథకం) తీసుకున్నా ప్రతిసారీ కేవైసీ ప్రక్రియ లేదా రీ-కేవైసీని పూర్తి చేయాల్సి వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇది వినియోగదారులకు, ముఖ్యంగా భారీ సంఖ్యలో జన ధన్ ఖాతాలు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక పెద్ద ఇబ్బందిగా మారిందన్నారు. ' ఎస్‌బీఐలో మాత్రమే 15 వేర్వేరు మార్గాల్లో కేవైసీ జరుగుతోందని మేము గుర్తించాం. అందుకే మా అంతర్గత ప్రక్రియలను పూర్తిగా సంస్కరించాలని భావిస్తున్నాం' అని ఛైర్మన్ శెట్టి వివరించారు. ఈ కేవైసీ పునరుద్ధరణ అనేది బ్యాంకు గుర్తించిన ఎనిమిది కీలకమైన సంస్కరణల్లో ఒకటైన ప్రాజెక్ట్ సరళ్‌లో భాగమని వెల్లడించారు. 50 మంది ఉద్యోగుల బృందం పని చేస్తున్నట్లు చైర్మన్ సీ.ఎస్ శెట్టి తెలిపారు. రెండు నెలల్లో ప్రక్రియను అర్థం చేసుకుని ఒక పరిష్కారం కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటవలే బ్యాంక్ తెచ్చిన సరళ్ ప్రాజెక్టు కింద ఇ- కేవైసీ సరళీకరణ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. సింగిల్ విండో కేవైసీ సిస్టమ్ అందుబాటులోకి వస్తే కస్టమర్లతో పాటు బ్యాంకుకూ పని భారం, ఒత్తిడి తగ్గుతుందన్నారు. కేవైసీ ప్రక్రియ సరళీకరణతో పాటు ఎస్‌బీఐ తన ప్రముఖ డిజిటల్ అప్లికేషన్ యోనో 2.0 రెండో తరాన్ని కూడా ప్రస్తుత త్రైమాసికంలో వాణిజ్యపరంగా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త యోనో యాప్ మరింత స్పష్టమైన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి, పూర్తిగా అధునాతన సాంకేతికతతో రూపొందించారు. ప్రస్తుతం 9.3 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్‌లు ఉండగా దీనిని 20 కోట్లకు పెంచాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ భారీ కస్టమర్ల సంఖ్యను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కొత్త యోనో యాప్ 2.0 అనేది 15 భాషల్లో సేవలను అందిస్తుంది. ముఖ్యంగా రైతులు, ఎంఎస్‌ఎంఈల కోసం కొత్త ఉత్పత్తులను జోడిస్తుంది.