కృష్ణానదిపై హైలెవల్ బ్రిడ్జి.. తీరనున్న ఆ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల..

Wait 5 sec.

కృష్ణా జిల్లా ఎదురుమొండి దీవులవాసుల ఏళ్లనాటి కల నెరవేరనుంది. ఈ దీవుల్లో 20 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి చిరకాల వాంఛ అయిన ఏటిమొగ - ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద దృష్టి సారించారు. ఏటిమొగ్గ - ఎదురుమొండి వంతెన నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ హైలెవల్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే నాబార్డు నుంచి రూ.109 కోట్ల నిధులు మంజూరయ్యాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. *అలైన్‌మెంట్లో మార్పుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిందన్న పవన్ కళ్యాణ్.. రూ.60 కోట్లు వరకూ నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.ఈ నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సాస్కీ నిధులు సమకూర్చనున్నట్లు వివరించారు. నిర్ణీత వ్యవధిలోనే ఏటిమొగ్గ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. *బుధవారం ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధిపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు. వారికి కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీసీఆర్సీ కార్డులు లేని కౌలు రైతులు కూడా చాలామంది ఉన్నారన్న పవన్ కళ్యాణ్.. నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.*మరోవైపు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు పనిచేయకుండా పోయాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీంతో నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రస్తుత ప్రభుత్వం అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఏడు అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి వీటికి కేటాయింపులు చేసి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు ఎదురుమొండి దీవుల పరిధిలో ఎదురుమొండి - గొల్లమంద మధ్య రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.13.88 కోట్లు కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైనట్లు వివరించారు. అయితే ఈ రోడ్డులో కొంత భాగం అటవీ శాఖకు చెందిన భూభాగం ఉందని.. దీంతో అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిందన్నారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమ ప్రాంతానికి ప్రజలు వెళ్లేందుకు అటవీ శాఖ కొంత రుసుము వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చింది. హిందువులకు ఈ ప్రాంతం పవిత్రమైనదన్న ఆయన.. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమైన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు.