సూపర్ స్టార్ హీరోగా దర్శక ధీరుడు ఎస్.ఎస్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి 'SSMB 29', గ్లోబ్‌ ట్రాటర్ వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ మూవీ అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. నవంబర్ లో అప్డేట్ ఉంటుందని రాజమౌళి స్వయంగా ప్రకటించడంతో, ఈ మూవీ ఈవెంట్ కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవెంట్‌ వివరాలను రాజమౌళి తనయుడు కార్తికేయ అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు - ఎస్.ఎస్ రాజమౌళి మూవీ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో నవంబర్ 15వ తేదీన ఈవెంట్‌ నిర్వహించనున్నట్టు ఎస్.ఎస్ కార్తికేయ వెల్లడించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో స్పెషల్‌ వీడియోను పోస్టు చేశారు. ''సమయం దగ్గర పడింది.. ఈ బిగ్ మూమెంట్ ని జరుపుకోవడానికి ఇంత కంటే మంచి ప్లేస్ ఇంకేముంటుంది? నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా ప్రేమ, చాలా ఉత్సాహంగా.. ఇదంతా మీ కోసమే...ప్రపంచం ఇప్పుడు 'గ్లోబ్‌ ట్రాటర్' చుట్టూ తిరుగుతుంది'' అని కార్తికేయ పేర్కొన్నారు. గ్లోబ్‌ ట్రాటర్ ఈవెంట్ ను జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు కార్తికేయ చెప్పకనే చెప్పారు. అయితే జియో హాట్‌స్టార్‌ కార్తికేయ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తమ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుందని స్పష్టం చేసింది. ఈ వేడుకలో 'SSMB 29' సినిమా టైటిల్‌ని ప్రకటించనున్నారు. ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లతో టైటిల్‌ని ప్రకటిస్తారా? గ్లింప్స్‌ లాంటిది రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.