ఎవరూ నమ్మరు కానీ మేం చాలా పేదోళ్లం.. ఉన్న ఆస్తి మెుత్తం అమ్మేశాం, అలసిపోయా: 'సర్పంచ్' నవ్య

Wait 5 sec.

. తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి, సోషల్ మీడియా ఉపయోగించే వారికి ఈ పేరు సుపరిచితమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై అదే నియోజకవర్గం ఉన్న నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. రాజయ్య తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె చేసిన ఆరోపణలు సృష్టించాయి. ఈ ఎపిసోడ్ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. తాజాగా.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు నవ్య. రాజకీయాలతో తాను బాగా అలసిపోయినట్లు చెప్పారు. అత్తమామలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో నవ్య చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.. 'బాగా అప్పులైనయ్. రాజకీయాల్లో రాణించాలంటే కోట్లకు కోట్లు ఆస్తులుండాలే. నాలోంటి పేదోళ్లు వస్తే కష్టం. మేం చాలా పేదోళ్లం. మేం ఏం లేనోళ్లం. మధ్య తరగతి కూడా కాదు. పేద కుటుంబం మాది. కానీ అట్ల చెబితే ఎవరూ నమ్మరు. నాకు ఒకటే ఎకరం చెల్క, 30 గుటంల పొలం. మా అత్తమామ సంపాదించిన ఆస్తి ఇదే. వాళ్లు సంపాదించిన ఆస్తి కూడా అమ్ముకున్నా. నాకు ఇప్పుడు ఇల్లు ఒక్కటే ఉంది. ఏం లేదు.. అన్ని పోయినయి. సర్పంచ్‌గా ఉన్న టైంలో చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉంది. బాగా డబ్బులున్నోళ్లకు అయితే బిల్లులు రాకపోయినా పర్వాలేదు. అవసరమైతే ఓ ఎకరం అమ్ముకొని బతుకుతరు. మాలాంటోళ్ల పరిస్థితి ఏంది..? రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులు కావాలి. కొన్ని బాధల నుంచి మనం అంత ఈజీగా బయటకు రాలేం. ఆ బాధల నుంచి బయటకు రావటానికి నా భర్త, పిల్లలు ప్రోత్సహించారు. అప్పట్లో ఇంతో అంత సంగీతం నేర్చుకున్నా. ఆ పాటలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాం. వాటికి కూడా చెడ్డ కామెంట్స్. నాపై లేనిపోని విమర్శలు. వాటిని చూసి నా అభిమానులు నాకో సలహా ఇచ్చారు. కొందరు చిల్లరగా చేస్తున్నారు.. మాట్లాడుతున్నారు.. వద్దని చెప్పారు. దీంతో వీడియోలు చేయటం ఆపేశా. ప్రస్తుతం నేను ఏ పార్టీలో లేను. కాలమే నిర్ణయిస్తది. కచ్చితంగా బయటకు వస్తా. రాజకీయాల్లో పోరాటం చేస్తా. ఇక నుంచి పొలిటికల్‌గా యాక్టివ్ అవుతా. సమస్యలపై పోరాడుతా.' అని జానకీపురం మాజీ సర్పంచ్ నవ్య వెల్లడించారు.