కోహ్లీ, ధోనీ వీరిలో ఇష్టమైన క్రికెటర్ ఎవరు? సమాధానం చెప్పిన హర్మన్ ప్రీత్ కౌర్

Wait 5 sec.

ధోనీ, కోహ్లీ ఈ ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ ఇద్దరు క్రికెటర్లు భారత క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో చెరగని ముద్ర వేశారు. తమదైన శైలిలో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తూ.. టీమిండియాకు విజయాలు అందించారు. టీమిండియా క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కేవలం ఆటగాళ్లుగా మాత్రమే కాకుండా.. కొందరికి ఆరాధ్య దైవాలుగా కూడా మారిపోయారు. అయితే ధోనీ, కోహ్లీలో ఎవరంటే ఇష్టం అనే ప్రశ్న టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఎదురైంది. అయితే ఆమె మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా ఆన్సర్ ఇచ్చింది.భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ విజయం సాధించి.. తొలి ఐసీసీ టైటిల్ అందుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రపంచకప్‌ విన్నర్లను సన్మానిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు సైతం వీరిని సత్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ స్కూల్‌కు వెళ్లింది హర్మన్ ప్రీత్ కౌర్.ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు హర్మన్‌తో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమెను ‘విరాట్‌ కోహ్లీ / ఎంఎస్‌ ధోనీ వీరిలో మీ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు?’ అని అక్కడి విద్యార్థులు ప్రశ్నించారు. ఏమాత్రం సంకోచం లేకుండా హర్మన్.. “ఎంఎస్‌ ధోనీ” అని టక్కున సమాధానం చెప్పింది. అంతేకాకుండా టీమిండియా మాజీ క్రికెటర్‌, డ్యాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు స్ఫూర్తిదాయకమని వెల్లడించింది. ‘ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అంటే ఇష్టం?’ అనే ప్రశ్నకు సైతం ఆమె బదులిచ్చింది. తనకు టెస్ట్‌ ఫార్మాట్‌ అంటే ఇష్టమని హర్మన్‌ సమధానమిచ్చింది.అనంతరం .. విద్యార్థులకు పలు సూచనలు చేసింది. జీవితంలో ఎదగడానికి, బాలికలు కష్టపడాలని పేర్కొంది. కలలు కనడం ఎప్పటికీ ఆపొద్దని సూచించింది. కలలు నిజం చేసుకునేందుకు కష్ట పడాలని హర్మన్ తెలిపింది.