వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారి రక్తమోడింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ ఆర్టీసీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కి చెందిన 'రాజధాని' ఎక్స్‌ప్రెస్ బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిడిగొండ వద్ద జాతీయ రహదారిపై అజాగ్రత్తగా ఆపి ఉంచిన ఇసుక లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై ధ్వంసమైంది. ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, లారీని అజాగ్రత్తగా రోడ్డుపై ఆపిన డ్రైవర్‌పై దర్యాప్తు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు తరుచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా జరిగింది. చేవెళ్ల సమీపంలోని మీర్జాపూర్ గేట్ వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. కంకర ప్రయాణికులపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో మెుత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి రోడ్డుపై గుంతలు, టిప్పర్ లారీ డ్రైవర్ అతివేగం కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం ఘటన మరవక ముందే తాజాగా జనగామ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు గల పూర్తి వివరాలు.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.