ఏపీ ప్రభుత్వ డ్రైవింగ్ స్కూల్స్.. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే, టెస్ట్ లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇస్తారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రభుత్వ గుర్తింపుతో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి శిక్షణ ఇస్తారు.ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ లో సరైన వసతులు, ట్రాక్‌లు లేవు, సరైన శిక్షణ కూడా అందడం లేదు. అందుకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణ అందించేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పది లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ శిక్షణా కేంద్రం (DTC) ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రకారం.. ఏపీకి రాష్ట్రానికి 53 DTCలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ (MoRTH) మంజూరు చేసింది. ఇటు 5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను (RDTCs) కూడా ఆమోదించింది. ఏపీకి కేటాయించిన 5 ప్రాంతీయ (ఆర్‌డీటీసీ)లో.. కోస్తాలో మూడు, ఉత్తరాంధ్రలో ఒకటి, రాయలసీమలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఆర్‌డీటీసీ ఏర్పాటు చేయాలంటే కనీసం మూడు ఎకరాల స్థలం ఉండాలి అంటున్నారు.. ఒక్కో సెంటర్‌కు కేంద్రం రూ.5కోట్లు ఆర్థిక సాయం, అక్కడ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేసుకునేవారికి అక్కడే డ్రైవింట్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు, అక్కడే మంజూరు చేస్తారు. ఇక డీటీసీ విషయానికి వస్తే.. కనీసం రెండు ఎకరాల స్థలం ఉండాలి. మోర్త్‌ కూడా ఆర్థిక సాయం అందిస్తుంది.. ఒక్కో సెంటర్‌ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో 85 శాతం కానీ.. గరిష్ఠంగా రూ.2.5 కోట్ల వరకు ఇస్తుంది. ఇక్కడ బైక్, కార్లు, భారీ వాహనాలైన బస్సులు, లారీలు నడిపేందుకు ట్రైనింగ్ ఉంటుంది. డ్రైవింగ్ క్లాసులతో పాటుగా సిమ్యులేటర్స్‌పైన, ట్రాక్స్‌పై శిక్షణ ఉంటుంది. మోర్త్ ఏ లైసెన్స్‌కు ఎన్ని రోజులు ట్రైనింగ్ కావాలి, ఎంత ఫీజులు వసూలు చేయాలో మోర్త్ చెబుతుంది. ఈ డీటీసీలో ట్రైనింగ్ పూర్తి చేసినవారికి మరో బంపరాఫర్ కూడా ఉంది. రాష్ట్ర రవాణాశాఖ దగ్గర లైసెన్స్‌ పొందే సమయంలో నిర్వహించే డ్రైవింగ్‌ టెస్ట్‌ కూడా అవసరం లేదు.. నేరుగా లైసెన్స్‌ జారీ చేస్తారు.ఆంధ్రప్రదేశ్‌లో 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (DTCలు), 5 రీజినల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (RDTCలు) ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించారు. వీటిని ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.. కలెక్టర్లు వీటిని పరిశీలించి రవాణాశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించి, అవసరమైన అర్హతలు, భూమి వంటివి ఉన్నాయో లేదో చూసి, రవాణాశాఖ కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత, రవాణాశాఖ కమిషనర్ ఆమోదంతో, జిల్లాకు సగటున రెండు DTCలు మంజూరు చేస్తారు.ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు రెండు చొప్పున DTCల కోసం దరఖాస్తులు అందాయి. అలాగే, అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అనంతపురం జిల్లా నుంచి వచ్చిన DTC దరఖాస్తును కేంద్ర రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మంజూరు చేసింది. అయితే, రీజినల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (RDTCలు) ఏర్పాటు చేయడానికి ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 'డీటీసీలు, ఆర్‌డీటీసీలకు జనవరి ఆఖరు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నాము. ఫిబ్రవరి ఆఖరు నాటికి వాటిని మోర్త్‌కు పంపాల్సి ఉంటుంది' అని అధికారులు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాలన్నీ వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.