మందుబాబులకు ఊరట.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఎత్తివేత

Wait 5 sec.

మందుబాబులకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇటీవల తీసుకువచ్చిన కఠినమైన మద్యం నిబంధనల నుంచి పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆల్కహాలిక్ బేవరేజ్ కంట్రోల్ చట్టం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం సేవించినా లేదా విక్రయించినా 10 వేల బాట్ (భారత కరెన్సీలో ఏకంగా రూ.27 వేలు) వరకు జరిమానా విధించే నిబంధన తీసుకురావడంపై పర్యాటక రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ నిబంధన పర్యాటకులను గందరగోళానికి గురిచేయడం, రెస్టారెంట్లు, బార్ల సేవలకు ఆటంకం కలిగించడంతో.. వెంటనే థాయ్ సర్కార్ స్పందించింది. మధ్యాహ్నం పూట మద్యం విక్రయాలు, సేవించడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి పట్టానా ప్రోమ్‌ఫత్.. నవంబర్ 13వ తేదీన చేసిన ప్రకటన ప్రకారం.. మద్యం అమ్మకాలు, సేవించడంపై ఉన్న ఈ నిషేధాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. డిసెంబర్ ప్రారంభం నుంచి 6 నెలల ట్రయల్ ప్రోగ్రాం కింద.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మద్యం అమ్మకాలకు తిరిగి అనుమతిని ఇవ్వనున్నారు. ఈ ట్రయల్ సక్సెస్ అయితే.. 2026 మే తర్వాత కూడా దీనినే పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్తగా సవరించిన ఆల్కహాలిక్ బేవరేజ్ కంట్రోల్ చట్టం ప్రకారం.. ఎవరైనా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మద్యం సేవించడం నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 10 వేల బాట్ (మన కరెన్సీలో రూ.27 వేలకు పైగా) చొప్పున భారీ జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధం కేవలం వ్యాపార సంస్థలకే కాకుండా.. జనాలకు కూడా వర్తించడంతో థాయిలాండ్‌కు వెళ్లే పర్యాటకుల్లో తీవ్ర గందరగోళం సృష్టించింది. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా మద్యం ప్రకటనలను కూడా ఈ చట్టం నిషేధం విధించింది.ఈ నిషేధం పర్యాటక, ఆతిథ్య రంగాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని సంబంధిత వర్గాలు తీవ్రంగా ఆందోళనను వ్యక్తం చేశారు. మధ్యాహ్నం సమయాల్లో పర్యాటకులు రిలాక్స్‌డ్‌గా డ్రింక్ ఆస్వాదించాలనుకుంటారని.. ఇలాంటి నిబంధన తీసుకురావడం వల్ల థాయ్‌లాండ్ టూరిజంను దెబ్బతీస్తుందని వారు వాదించారు. దీనిపై స్పందించిన థాయ్ ప్రభుత్వం.. మధ్యాహ్నం తాత్కాలికంగా మద్యంపై నిషేధాన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. అయితే లైసెన్స్ పొందిన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, కొన్ని హోటళ్లు, టూరిస్ట్ ప్రాంతాల్లోని సర్టిఫైడ్ సంస్థలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు వంటి కొన్ని ప్రదేశాలకు ఈ నిబంధనల నుంచి ఇదివరకే మినహాయింపు ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో 3 గంటల మద్య నిషేధం అమల్లో ఉండనుంది.