HYD మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నో వెయిటింగ్, 2 నిమిషాలకో ట్రైన్.. త్వరలోనే..!

Wait 5 sec.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ప్రస్తుతం పీక్ ఆవర్స్‌లో 5 నిమిషాలకో ట్రైన్, రద్దీ లేని సమయంలో 10.12 నిమిషాలకో ట్రైన్ నడుస్తుండగా.. త్వరలోనే 2 నిమిషాలకో ట్రైన్ అందుబాటులోకి రానున్నాయి. నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెట్రో రైలు కోచ్‌ల సంఖ్య పెంపు నిర్ణయాన్ని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) పరిశీలిస్తోంది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్లు సరిపోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో బిజీ రూట్లలో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం, 56 మెట్రో రైళ్లలో కేవలం మూడు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో మెట్రో రైళ్లు నాలుగు, ఆరు, కొన్నిచోట్ల ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్నాయని హైదరాబాద్ నగరంలో నడపాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య, నిర్వహణ సాధ్యత, ఇతర కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం 40 నుంచి 60 అదనపు కోచ్‌లను సేకరించాలని HMRL నిర్ణయించింది.HMRL మేనేజింగ్ డైరెక్టర్ (MD) సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. కొత్త కోచ్‌లను ఇప్పటికే ఉన్న రైళ్లకు జోడించకుండా రూట్ అవసరాలు,ప్రయాణికుల రద్దీని బట్టి మూడు, నాలుగు లేదా ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌లను లేదా మల్టీ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ కోచ్‌లను దేశంలోని మూడు ప్రముఖ మెట్రో తయారీ యూనిట్లైన ఆల్‌స్టోమ్, బీఈఎంఎల్ లిమిటెడ్, టిట్లఘర్ రైల్ సిస్టమ్స్ నుంచి సేకరించనున్నట్లు తెలిపారు. ఎక్కువ కోచ్‌లను ప్రవేశపెట్టడం వల్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని.. తద్వారా ప్రయాణికులు వెయిటింగ్ టైం తగ్గుతుందన్నారు. రెండు రైళ్ల మధ్య సమయాన్ని రెండు నిమిషాలకు తగ్గించవచ్చునని చెప్పారు. ఇది కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు, విద్యార్థులకు ముఖ్యంగా పీక్ అవర్స్‌లో జర్నీ చేసేవారికి ఉపయోగపడుతుందన్నారు. అయితే, ఈ కోచ్‌లు హైదరాబాద్‌కు చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయన్నారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోచ్‌లు హైదరాబాద్‌కు చేరుకోవడానికి కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. ఎల్అండ్ టీ నుంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టేకోవర్ చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియను చురుగ్గా ముందుకు తీసుకువెళ్తామని చెబుతున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని రెగ్యులర్ మెట్రో ప్రయాణికులు స్వాగతించారు. ప్రతిరోజు పీక్ అవర్స్‌లో రద్దీగా ఉండే కంపార్ట్‌మెంట్‌లతో ఇబ్బంది పడాల్సి వస్తోందని.. ఎక్కువ కోచ్‌లు చేర్చడం రద్దీ సమస్యను చాలా వరకు పరిష్కరిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహిళల కోసం ఒకే కోచ్ ఉందని.. కోచ్‌ల సంఖ్య పెరిగితే మహిళల కోసం కనీసం రెండు కంపార్ట్‌మెంట్లను రిజర్వ్ చేయాలని మెట్రో అధికారులను కోరుతున్నాను. కాగా, ఈ నిర్ణయం అమలులోకి వస్తే హైదరాబాద్ మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది.