తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. ఈ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ (యూ)లో మంగళవారం రాత్రి అత్యంత కనిష్ఠంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్‌సీయూ ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలో సగటున పడిపోయాయని తెలిపారు. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్‌చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) రవీందర్‌ నాయక్‌ తెలిపారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లను వెంటనే కలవాలన్నారు. గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు లేదా అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలన్నారు. మరో వారం రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.