ఏపీ నుంచి వెళ్లిపోయినోళ్లే వెనక్కు వచ్చేశారు. ఆ సీక్రెట్ రివీల్ చేసిన మంత్రి లోకేష్.. ఏకంగా రూ.82వేల కోట్లు

Wait 5 sec.

ఏపీ మంత్రి నారా లోకేష్ ఆ సీక్రెట్ ఏంటో బయటపెట్టారు. బుధవారం రాత్రి '2019లో కొత్త ప్రాజెక్టులు ఆపిన ఒక కంపెనీ.. నవంబర్ 13, 2025 ఏపీలో ' తుఫాన్‌'లా తిరిగి వస్తోంది. అది ఎవరు? 9 AMకు గ్రాండ్ అనవీల్. స్టే ట్యూన్' అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ.. చెప్పినట్లుగానే ఇవాళ 9 గంటలకు మరో ట్వీట్ చేశారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోందని..రాష్ట్రంలో రెన్యూ పవర్‌ తిరిగి అడుగుపెడుతోందన్నారు.. రాష్ట్రంలో రెన్యూ పవర్‌ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో రెన్యూ పవర్‌ భారీగా పెట్టుబడులు పెడుతుందన్నారు. పునరుత్పత్తి శక్తి రంగంలో రెన్యూ పవర్‌ భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది అన్నారు. విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రస్తావించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే విశాఖపట్నంలో పెట్టుబడుల సందడి కనిపిస్తోంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ పలు కంపెనీలకు భూమిపూజ చేయనున్నారు. ఈ పెట్టుబడులు ఐటీ రంగంతో పాటుగా ఇతర రంగాల్లోనూ ఉన్నాయి. వీటిలో టెక్‌ తమ్మిన సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, సెయిల్స్‌ సాఫ్ట్‌వేర్, ఐ స్పేస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, ఫినోమ్‌ పీపుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వంటి ఐటీ ఉన్నాయి. వీటితో పాటు, రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నాయి.. వేలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఇవాళ విశాఖపట్నం ఎకనామిక్‌ కారిడార్‌ డీపీఆర్‌ను విడుదల చేస్తారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, ప్రధాని మోదీ సహకారంతో నడుస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, వేగంగా తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పటికే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరో 120 బిలియన్ డాలర్ల విలువైన 410 ఎంఓయూలు కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందాలన్నీ రాబోయే 12 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 7.50 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచంలో ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తున్నామన్నారు.విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్, రామ్మోహన్‌నాయుడితోపాటు 45 దేశాల నుంచి 465 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెబుతున్నారు. వీరితో పాటుగా 13 మంది రాయబారులు, 58 మంది దౌత్యవేత్తలు, హైకమిషనర్లు, మిషన్‌ డిప్యూటీ హెడ్స్‌ నలుగురు, కౌన్సిలర్‌ జనరళ్లు ఐదుగురు హాజరుకానున్నారు. అంతేకాదు ఆయా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయట.