Groww Shares: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు రోజుల్లోనే ఏకంగా 53 శాతం మేర లాభాలు అందించింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,00,000 కోట్ల మైలురాయికి చేరువైంది. ఈ వార్త రాసే సమయానికి గ్రో పేరెంట్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 91,500 కోట్లకు పైగా ఉంది. మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత ఈ స్టాక్ భారీగా ర్యాలి చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెండో రోజూ ఇదే జోరు కనబరుస్తోంది. ఇవాళ 17 శాతానికి పైగా పెరిగింది. గ్రో పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ. 100తో పోలిస్తే ఈ స్టాక్ 53.5 శాతం మేర పెరిగింది. బీఎస్ఈలో 14 శాతం ప్రీమియంతో రూ. 114 వద్ద లిస్టింగ్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చూసుకున్నా ఈ స్టాక్ రెండ్రోజుల్లో 34.6 శాతం మేర లాభాలు అందించింది. బలమైన ఇన్‌స్టిట్యూషనల్, రిటైల్ డిమాండ్ కొనసాగుతున్న క్రమంలో ఈ కంపెనీ స్టాక్ గ్రాండ్‌గా మార్కెట్లలో లిస్టింగ్ అయింది. ప్రస్తుతం విశ్లేషకులు కంపెనీ విధానపరమైన బలాలు, బిజినెస్ ఔట్‌లుక్, పోస్ట్ లిస్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా కంపెనీ స్టాక్ ఏ విధంగా స్పందించనుంది అనేది చెప్పనున్నారు. అయితే నవంబర్ 3వ తేదీనే యాంకర్ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించారు. వారికి రూ. 2984 కోట్ల మేర షేర్లు కేటాయించారు. ఇక సబ్‌స్క్రిప్షన్ తుది రోజున ఈ షేర్ల కోసం ఏకంగా 17.60 రెట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ఈ ధరల శ్రేమి రూ. 95 నుంచి రూ. 100గా నిర్ణయించగా గరిష్ఠ ధర వద్ద రూ. 61,700 కోట్లు సమీకరణ లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఫ్రెష్ షేర్ల జారీ ద్వారా రూ. 1060 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 55.72 కోట్ల షేర్లను జారీ చేశారు. గ్రో కంపెనీ బలమైన స్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ స్టాక్స్ కొనేందుకు మదుపరులు ఎగబట్టారు. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకుంటూ తొలిరోజే 14 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో లిస్టింగ్ అయింది. ఆ తర్వాత కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.