TARIL Share Price: స్టాక్ మార్కెట్ సూచీలు గత వారానికి భిన్నంగా ట్రేడ్ అవుతున్నాయి. . అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, యూఎస్ షట్‌డౌన్ కారణంగా సూచీలు పడిపోగా.. ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది. అయితే ఈ వారం మాత్రం.. సానుకూలంగా ప్రారంభమయ్యాయి. యూఎస్ షట్‌డౌన్ ముగుస్తుందన్న అంచనాల నడుమ ప్రధానంగా ఐటీ షేర్లు రాణిస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ వార్త రాసే సమయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగి 83,650 మార్కుపైన ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 25,620 స్థాయిలో ట్రేడవుతోంది. అయితే మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నప్పటికీ.. పలు ప్రభుత్వ రంగాల స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వేకు చెందిన ప్రభుత్వ కంపెనీ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ ఇండియా లిమిటెడ్ (TARIL) షేరు కుప్పకూలింది. కిందటి సెషన్‌లో ఈ స్టాక్ NSE లో రూ. 391.90 వద్ద ముగియగా.. సోమవారం రోజు నేరుగా 20 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టి రూ. 313.55 వద్ద ఓపెన్ అయింది. ఇంట్రాడేలో రూ. 323.60 వద్ద గరిష్టాన్ని తాకినప్పటికీ.. చివరకు 20 శాతం లోయర్ సర్క్యూట్‌లోనే స్థిరపడింది. >> ఈ కంపెనీ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందుతో పోలిస్తే బలహీనంగా నమోదవడంతో.. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి దిగారు. దీంతో షేర్ ధర భారీగా పడిపోయింది. సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ. 37.45 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లాభం రూ. 46 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు ఇది 20 శాతం వరకు పతనమైంది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 460 కోట్లుగా వచ్చింది. ఇది గతేడాది రూ. 461 కోట్లుగా ఉంది. ఇక్కడ పెద్దగా తేడా ఏం రాలేదు. ఎబిటా కూడా 19 శాతం తగ్గి రూ. 65.44 కోట్లుగా వచ్చింది. దీంతో ఈసారి అంచనాల్ని అందుకోలేకపోవడంతో.. ఇంతలా పతనమైంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 648.90 గా ఉండగా.. కనిష్ట ధర రూ. 313.55 గా ఉంది. ఇక మార్కెట్ విలువ రూ. 9.41 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో చూస్తే ఈ స్టాక్ 30 శాతం తగ్గింది. నెలలో 36 శాతం దిగొచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే సగానికి సగం (48 శాతం) పడిపోవడం గమనార్హం.