వైజాగ్‌కు కొత్త పేరు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్

Wait 5 sec.

విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర కొనసాగుతోంది.. సాగర తీర నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. గత రెండు రోజులుగా రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.మరోవైపు లో ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌ (VIZAG)కు సరికొత్త నిర్వచనం చెప్పారు. వి - విజన్‌ (దార్శనికత), ఐ - ఇన్నోవేషన్‌ (ఆవిష్కరణ), జడ్‌ - జీల్‌ (ఉత్సాహం), ఏ - యాస్పిరేషన్‌ (ఆశయం), జీ - గ్రోత్‌ (వృద్ధి) అంటూ వివరించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని, వ్యాపార నిర్వహణలో వేగం (స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) అందరికీ అర్థమయ్యేలా, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా, అందరి సహకారాన్ని, అభివృద్ధిని కోరుతూ రెండు రోజుల పాటు ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు దేశం పార్టీ కూడా దీనిపై ట్వీట్ చేసింది. 'చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే "ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం" అని చెప్పుకుంటున్నారు' అంటూ ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ ఆనందించారు. ఏపీ పెవిలియన్‌లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఈ సదస్సులో పాల్గొన్న వారందరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ సదస్సు శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు.