గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే కనిపిస్తున్నాయి. పైగా ఇవన్ని భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. మరీ ముఖ్యంగా ద నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడం కోసం నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రంగంలోకి దిగింది. 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన సంస్థ.. ఆరు వరుసల రహదారలు నిర్మాణంలో అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా హైవే దాటే బైక్, స్కూటర్లు నడిపేవారు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వారు ప్రమాదాల బారిన పడకుండా.. ప్రతి జంక్షన్‌లో అండర్‌పాస్ వంతెనను నిర్మింస్తోంది. ఈక్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవే మీద 60 అండర్ పాస్ వంతెనలు నిర్మించతలపెట్టింది. ఆ వివరాలు.. ఆరు వరుసల హైవే విస్తరణకు సంబంధించిన ఇప్పటికే ఐకాన్స్ అనే సంస్థ డీపీఆర్‌ను సిద్ధం చేసింది. ప్రతి జంక్షన్‌లో ఒక అండర్ పాస్ నిర్మించేలా డీపీఆర్ రెడీ చేసి.. ఎన్‌హెచ్‌ఏఐకి అందజేసింది. దీని ప్రకారం.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఉన్న దండుమల్కాపురం నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ వరకు 231.32 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 60 ప్రాంతాల్లో అండర్‌పాస్‌ వంతెనలు రానున్నాయి. అంటే ప్రతి 2-3కిలోమీటర్లకు ఒకటి నిర్మించబోతున్నారు.అలానే మరో 17 ప్రాంతాల్లో వీయూపీ(వెహిక్యులర్‌ అండర్‌ పాసెస్‌), 35 చోట్ల ఎల్‌వీయూపీ(లైట్‌ వెహిక్యులర్‌ అండర్‌ పాసెస్‌ ), మరో ఎనిమిది ప్రాంతాల్లో స్మాల్‌ వెహిక్యులర్‌ అండర్‌ పాసెస్‌ (ఎస్‌వీయూపీ) నిర్మించబోతున్నారు. అలానే 10 చోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో ఇప్పటికే కొన్ని బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవే మీద తరచుగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. నాలుగు వరుసలగా నిర్మించిన ఈ రహదారి నిర్మాణంలో లోపాల వల్లే తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఈ హైవే నిర్మాణ సమయంలో రాజకీయ పార్టీలు, నేతల జోక్యం పెరిగింది. ఈ రహదారి నిర్మాణ సమయంలో వీరంతా తమకు కావాల్సిన చోటల్లా రహదారిని తమకు నచ్చినట్లు మలుపులు తిప్పేశారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా.. సిటీల్లో అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంది. అయితే దీని వల్ల గ్రామాలు రెండుగా చీలిపోతాయంటూ అప్పట్లో రాజకీయ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఈ ప్రతిపాదనను పక్కకు పెట్టి.. చిట్యాల, చౌటుప్పల్, నందిగామ, కంచికచర్ల వంటి గ్రామాల్లో అండర్‌‌పాస్‌లు లేకుండానే నేషనల్ హైవే నిర్మించారు. దీని వల్లనే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటున్నారు. ఈక్రమంలో ‌ఎన్‌హెచ్‌ఏఐ 4 వరుసల రహదారి నిర్మాణంలో చేసిన తప్పిదాలను 6 వరుసల రహదారి నిర్మాణంలో చోటు చేసుకోకుండా ఇప్పుడు చర్యలు చేపడుతోంది. వీటి వల్ల ప్రమాదాలను నివారించడమే కాక.. ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు.. త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు.