మొదటి రోజు భారత్ పైచేయి సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ వికెట్లు పడినా పోరాడిన సౌతాఫ్రికా.. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్‌తో పాటు కూడా రాణించడంతో సఫారీలు 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ వెర్రేయన్ వికెట్ తీసి భారత్‌కు బ్రేక్ త్రూ ఇచ్చిన సిరాజ్.. ఆ వికెట్ తీసే ముందు కెప్టెన్‌తో జరిగిన సంభాషణను బయట పెట్టాడు. సిరాజ్ వేసిన మొదటి 9 ఓవర్లలో 43 పరుగులు రావడంతో.. కెప్టెన్ గిల్ సిరాజ్‌ను పక్కనబెట్టేశాడు. సిరాజ్ బౌలింగ్ వికెట్ల వైపు వెళ్లకపోవడం, సఫారీ బౌలర్లు బౌండరీలు బాదడంతో గిల్ సిరాజ్‌కు మళ్లీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడాడు. అదే సమయంలో "నాకు ఒక్క ఓవర్ ఇవ్వు చాలు" అంటూ గిల్‌ను ఒప్పించుకుని బంతిని తీసుకున్నాడు. మొదటి బంతికే వెర్రేయన్‌ను ఎల్‌బీ డబ్ల్యూగా పెవిలియన్‌కు పంపిన మియా భాయ్.. అదే ఓవర్‌లో నాలుగో బంతికి మార్కో యాన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే బుమ్రా కూడా మిగతా బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి సఫారీలను ఆలౌట్ చేసేశాడు. అయితే, తాను వికెట్లు తీయడంలో బుమ్రా సలహా బాగా పనిచేసిందంటూ సిరాజ్ అన్నాడు. "జస్సీ భాయ్ స్టంప్స్‌కు మాత్రమే లైన్ పెట్టమన్నాడు. అలా వేస్తేనే ఎల్‌బీడబ్ల్యూ, బౌల్డ్, క్యాచ్ అన్నీ నీకు వికెట్ దక్కుతుందన్నాడు. మర్కరమ్ - రికెల్టన్ జోడీ ఆరంభంలో మంచి భాగస్వామ్యం ఇచ్చినా.. మేము మళ్లీ తిరిగి బౌన్స్ అయ్యాం. ఒకే వికెట్ కోల్పోయి తొలి రోజు ఆట ముగియడం మాకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం మ్యాచ్‌లో మేమే ముందున్నాం" అని మ్యాచ్ అనంతరం సిరాజ్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కేవలం 14 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసుకున్నాడు. అందులో 5 మేడిన్ ఓవర్లు కాగా, 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా.. అక్షర్ ఒకటి దక్కించుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా 55 ఓవర్లకే 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.