హైదరాబాద్‌-అమరావతి-బందర్ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే.. డీపీఆర్‌ కోసం కన్సల్టెన్సీ ఎంపిక, త్వరలోనే..!

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మీదుగా కీలకమైన మచిలీపట్నం (బందరు) పోర్టు వరకు నిర్మించనున్న ప్రతిష్టాత్మకమైన తుది రూపు దిద్దుకోవడంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక ముందడుగు వేసింది. దాదాపు 300 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థపై ఎన్‌హెచ్‌ఏఐ ఒక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం హైదరాబాద్‌- విజయవాడ మధ్య ఉన్న నాలుగు వరుసల విస్తరించే బాధ్యతలు అప్పగించబడిన సంస్థకే ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలను కూడా అప్పగించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలను ఒకే సంస్థ తయారు చేయడం వల్ల సమన్వయం మెరుగుపడి, నిర్మాణ వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ 300 కి.మీ. ఆరు వరుసల రహదారి డీపీఆర్‌ రూపకల్పనకు సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు.ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డీపీఆర్‌ తయారీకి గడువును కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశించింది. మొదటగా, కన్సల్టెన్సీ సంస్థ రానున్న 3 నెలల్లో రహదారి తుది ఎలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఎలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత, పూర్తిస్థాయి డీపీఆర్‌పై దృష్టి సారిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా ట్రాఫిక్‌ సర్వే, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటలు వంటి వాటిపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. పూర్తిస్థాయి నివేదికను సమర్పించడానికి సంవత్సరానికిపైగా సమయం పట్టే అవకాశం ఉంది.ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో ట్రాఫిక్‌ సర్వే ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని ఆరు వరుసలుగా విస్తరిస్తుండడంతో ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ట్రాఫిక్‌ సర్వే అధ్యయన ఫలితాల ఆధారంగానే రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించాలా లేక ఆరు వరుసల రహదారిగా నిర్మించాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత ఎన్ని వరుసల రహదారి అనేది స్పష్టతకు వస్తుంది.ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌- మచిలీపట్నం మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక, మచిలీపట్నం పోర్టు ద్వారా వాణిజ్యం, రవాణా మెరుగుపడడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఇది గొప్ప దోహదకారిగా మారుతుంది.