'అంతా దేవుడి దయవల్లే'.. కమ్‌ బ్యాక్‌పై రిషభ్ పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Wait 5 sec.

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్‌ రిషభ్ పంత్ మరోసారి టీమ్ ఇండియా జెర్సీని ధరించేందుకు సిద్ధమవుతున్నాడు. నాలుగు నెలల గ్యాప్ తర్వాత, శుక్రవారం కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టెస్ట్‌లో మైదానంలోకి దిగనున్నాడు. గాయాల కారణంగా ఎన్నో సార్లు జట్టుకు దూరమైన పంత్ ఈ సారి తిరిగి రావడం అనేది నిజంగా దేవుడి దయవల్లే అని అన్నాడు “గాయం తర్వాత తిరిగి రావడం ఎప్పుడూ సులభం కాదు. కానీ దేవుడు ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. ఈ సారి కూడా ఆయన ఆశీర్వాదంతోనే నేను మళ్లీ మైదానంలోకి వస్తున్నాను” అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో పంత్ అన్నాడు.ఇంగ్లండ్‌పై జూలైలో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో పాదానికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత భారత్ ఏ జట్టుతో జరిగిన దక్షిణాఫ్రికా ఏపై రెండు అనధికారిక టెస్టుల్లో తిరిగి బరిలోకి దిగాడు. ఇప్పుడు తిరిగి భారత జట్టులోకి రానున్నాడు. పంత్ తన రెస్ట్ సమయంలో మానసిక స్థైర్యం కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టానని, బయట నుంచి వచ్చే ఊహాగానాల గురించి ఆలోచించలేదని చెప్పాడు.“నా దృష్టి ఎల్లప్పుడూ నేను నియంత్రించగలిగిన విషయాలపైనే ఉంటుంది. అదృష్టం వంటి విషయాలు మన చేతిలో ఉండవు. కాబట్టి వాటి గురించి ఆలోచించను. మీరు మైండ్‌ను ఒక స్థిరమైన స్థితిలో ఉంచితే, అనవసర విషయాలు మీపై ప్రభావం చూపవు” అని పంత్ అన్నాడు.తన జీవితంలో జరిగిన కారు ప్రమాదం తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన పంత్, ఇప్పుడు మరోసారి గాయాల నుంచి కోలుకుని మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, బీసీసీఐ అందించిన సహకారాలకు కృతజ్ఞతలు తెలిపాడు. “ప్రతి సారి నేను మైదానంలోకి దిగినప్పుడు, దేవుడికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి ధన్యవాదాలు చెబుతాను. వాళ్ల సపోర్ట్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు” అని పంత్ ఎమోషనల్ అయ్యాడు. “మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేర్చుకోవాలనే దృక్పథం ఉండాలి. క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం, మీరు చేసే పనిలో ఆనందం కనుగొనడం అత్యంత ముఖ్యం. మీరు వంద శాతం ఇస్తే, ఆ క్షణమే సంతోషాన్ని ఇస్తుంది” అని పంత్ వివరించాడు.