మహిళలకు పీరియడ్స్ అనేవి ప్రతీ నెల సర్వసాధారణం. అయితే ఆ సమయంలో వారు చాలా ఇబ్బంది పడతారు. కడుపునొప్పి, అలసట సహా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని ఉద్యోగినుల కోసం నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తూ నవంబర్ 12వ తేదీ (బుధవారం) రోజున ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న కర్ణాటక రాష్ట్రంలో 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసు ఉన్న అందరు మహిళా ఉద్యోగులు (పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు) నెలకు ఒకటి చొప్పున.. ఏడాదికి 12 రోజులు వేతనంతో కూడిన సెలవులను అందించనున్నారు. ఈ ఉత్తర్వులు ఫ్యాక్టరీస్ చట్టం, షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం (ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు), ప్లాంటేషన్ వర్కర్స్ చట్టం వంటి వాటి పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు వర్తిస్తాయని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.ఇక ఈ నెలసరి సెలవును ఏ నెలకు సంబంధించి ఆ నెలలోనే మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవాలని.. వాటిని తర్వాత నెలకు బదిలీ చేయడానికి వీలు లేదని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సెలవును తీసుకోవడానికి వారు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహిళా ఉద్యోగుల ఆరోగ్య, మానసిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. వారికి ఈ నెలసరి సెలవు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.డాక్టర్ స్వప్న ఎస్ (క్రిస్ట్ యూనివర్సిటీ) నేతృత్వంలోని 18 మంది సభ్యుల కమిటీ.. తొలుత ఏడాదికి 6 సెలవులను మాత్రమే సూచించింది. అయితే.. కర్ణాటక కార్మిక శాఖ వాటిని 12కు పెంచి సిద్ధరామయ్య ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా.. నెల రోజుల క్రితమే కర్ణాటక రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలపగా.. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కర్ణాటక రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళా ఉద్యోగులకు గొప్ప ఊరటనిస్తుందని పేర్కొంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.