సాధారణంగా ఏదైనా విలువైన వస్తువులు, లేదంటే బంగారు ఆభరణాలు వంటివి పోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటాం. కానీ నా చెప్పులు, షూలు పోతే కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్టు ఎప్పుడైనా విన్నారా? అవును అలాంటి ఘటనే జరిగింది. ఓ టెకీ మనసు ప్రశాంతంగా ఉండాలని గుడికి వెళ్లాడు. దేవుడికి దండం పెట్టుకుని తిరిగి గుడి మెట్ల వద్దకు వస్తే.. అతడి మనసు ముక్కలైంది. అతడు ఎంతో ప్రేమగా కొనుక్కున్న షూలు కనిపించలేదు. దీంతో తన షూలు ఎత్తుకెళ్లిన వారిపై కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడానికి మొదట ఆసక్తి చూపించలేదు. కానీ బాధితుడు చెప్పిన ఒక్క మాటతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బనశంకరి స్టేజ్‌-IIIలో ఉన్న శ్రీ గణేశ ఆలయానికి.. ఓ టెకీ బైక్‌పై వెళ్లాడు. బైక్‌ను పార్క్ చేసి.. ఇతర భక్తుల లాగా తన షూలను ఆలయం ముందు మెట్ల వద్ద వదిలి వెళ్లాడు. 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని తిరిగివచ్చేసరికి షూలు కనిపించలేదు. రూ. 16,000 (ఆసిక్స్ బూట్లు) విలువైన బూట్లు కనిపించకపోయే సరికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంతరం తేరుకుని.. ఆలయ నిర్వహణ అధికారి, పూజారిని సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో షూలు దొంగతనంపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మొదట్లో పోలీసులు ఆసక్తి చూపించలేదు. ఆ ఒక్క మాటతో..చెప్పుల దొంగతనాలు ఆలయాల వెలుపల ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని బాధితుడు పోలీసులకు చెప్పాడు. ఇలాంటి చిన్న దొంగతనాలను విస్మరిస్తే.. అదే వ్యక్తి ఇంకా పెద్ద నేరాలకు పాల్పడతాడన్నాడు. కాబట్టి అలాంటి వారికి గుణపాఠం నేర్పించి.. మంచి దారిలో నడిపించాలని.. అందుకే కేసు నమోదు చేసుకోవాలని పట్టుబట్టాడు. ఆ ఒక్క మాటతో కరిగిపోయిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. BNS సెక్షన్ 303 (దొంగతనం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి పరిశీలించారు. అందులో ఓ దొంగ చెప్పులు లేకుండా భక్తుడిలా నటిస్తూ.. ఫిర్యాదుదారుడి పాదరక్షలతో వెళ్లిపోతున్నట్లు కనిపించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే గతంలోనూ ఇద్దరు పాదరక్షల దొంగలు పట్టుబడ్డారని.. మద్యం కొనడానికి రూ. 20 నుంచి రూ. 50కి వాటిని అమ్మేవారని పోలీసులు వెల్లడించారు.