ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినవారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్‌ జారీకి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడంలో ఆలస్యం లేకుండా అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇకపై ఒక వారం లోపు కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించకపోతే, ఆటోమెటిక్‌గా నంబర్ కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే వాహన కొనుగోలుదారులు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.సాధారణంగా, కొత్త వాహనం కొన్నప్పుడు డీలర్ షోరూమ్‌లోనే ముందుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. ఆ తర్వాత, వాహన వివరాలు పోర్టల్‌కు వెళ్లిన రెండు, మూడు రోజుల్లోనే రవాణాశాఖ అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి. అయితే, కొందరు అధికారులు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. ఒకవేళ వాహన యజమాని ఫ్యాన్సీ నంబర్ కావాలని కోరుకుంటే, అప్పుడు నెల రోజుల వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్‌తో వాహనాన్ని నడుపుకోవచ్చు. కానీ ఫ్యాన్సీ నంబర్లు అవసరం లేని వాహనాలకు మాత్రం వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించాలి. అయితే ఈ కొత్త విధానం వల్ల వాహన కొనుగోలు చేసినవారికి మేలు జరుగుతుంది.రాష్ట్రంలో నెలల తరబడి వాహనాలకు నంబర్లు కేటాయించకుండా ఆలస్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాలా వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే అనేక చోట్ల రవాణా అధికారులు ఈ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీనిపై వాహన డీలర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహన రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేడమే లక్ష్యంగా ప్లాన్ చేశారు రవాణాశాఖ కమిషనర్ మనీష్‌కుమార్‌ సిన్హా ఎన్‌ఐసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారం రోజుల్లోగా నంబర్ కేటాయించకపోతే, ఆటోమేటిక్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేలా వాహన్‌ సాఫ్ట్‌వేర్‌లో వెంటనే మార్పులు చేసేందుకు సిద్ధమవతున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.