ప్రజల మెప్పు పొందిన, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు. గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన వాటర్‌షెడ్‌ మహోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన శివరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏపీకి నేనూ మామనే.. మధ్యప్రదేశ్‌లో అందరూ ఆప్యాయంగా తనను మామ అని పిలుచుకుంటారని.. ఇక నుంచి తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మామనే అని చెప్పారు. ఏపీలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది సరైన కాంబినేషన్ అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హిందీలో మాట్లాడటం తనను ఆలోచింపజేసిందన్న శివరాజ్ సింగ్.. మళ్లీ ఏపీ వచ్చినప్పుడు తెలుగు నేర్చుకుని వస్తాన్నారు. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలోనూ ముందుండాలని శివరాజ్ సింగ్ ఆకాంక్షించారు. మట్టికి జీవం పోసి, మంచినీటిని కాపాడుకోవాలి.. అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. మట్టి లేకపోతే రైతులకు ఆధారం లేదని చెప్పారు. ఈ రెండింటినీ కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని.. మట్టికి జీవం పోసి, మంచినీటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఆలోచనతో చేపట్టిన వాటర్‌షెడ్‌ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం అన్నారు. గుంటూరు జిల్లాలోని 150 ఏళ్ల వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి చేసిన తీరు దేశానికే ఆదర్శం అని చెప్పారు. వెంగళాయపాలెం చెరువు స్ఫూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధితో పాటు చెక్‌డ్యామ్‌లు నిర్మించి.. రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అనంతపురం జిల్లాలోని ఇప్పేరు, అన్నమయ్య జిల్లాలోని గుండ్లపల్లి, కుప్పం నియోజకవర్గంలోని కడపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు.. వర్చువల్‌ విధానంలో భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు శివరాజ్ సింగ్. అంతేకాకుండా వాటర్‌షెడ్‌ జన్‌భాగీదారీ కప్‌-2025 పోటీలో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కాగా, వాటర్‌షెడ్‌ మహోత్సవ్‌లో రెండు రోజులపాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల ద్వారా వచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని.. వాటర్‌షెడ్‌ అభివృద్ధి సదస్సు- ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 3.0 రూపకల్పనను ప్రారంభించారు. ఈ మేరకు సమగ్ర నివేదిక తయారుచేసేందుకు కమిటీలను నియమించారు. నివేదిక తయారీలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను.. ఇక్రిశాట్, ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు వివరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు శ్యామ్‌సుందర్‌ పాలీవాల్, ఉమాశంకర్‌ పాండేలు.. నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపులో ఏవిధంగా విజయవంతమయ్యామో వివరించారు. దేశంలోని వర్షాభావ పరిస్థితులు ఉన్న ఇతర రాష్ట్రాలు అలాంటి నీటి సంరక్షణ పద్ధతులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ సదస్సులో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ‘జగన్‌ మాట, మందు, మనసు కల్తీ అని.. మనిషి మొత్తం కూడా కల్తీ అని ఘాటుగా విమర్శించారు.