కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి దర్శనాలకు వచ్చే భక్తులను దళారుల వంచిస్తోన్న ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. స్వామి భక్తులకు వివిధ మార్గాల్లో ఎరవేసి.. నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. కొంతమంది భక్తులు (టీటీడీ) నిర్దేశించిన పద్దతిలో కాకుండా దర్శనాల విషయంలో ఫ్రెండ్స్, బంధువులను సంప్రదించడం, వాళ్లేమో తమకు తెలిసినవారిని పరిచయం చేయడం, సదరు వ్యక్తులు దళారులు అవతారం ఎత్తి దోచుకోవడం నిత్యకృత్యమైంది. ఉద్యోగులమని, రాజకీయ నాయకులమని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యక్తిగత కార్యదర్శులు, పీఆర్వోలుగా నకిలీ ఐడీలు సృష్టించుకొని సోషల్ మీడియాలో లింకులు పంపిస్తున్నారు. స్వామివారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌కు తమను సంప్రదించాలంటూ సూచించి... బురిడీ కొట్టిస్తున్నారు. నమ్మించి అందికాడికి దోచుకుని.. తర్వాత ఫోన్‌‌కు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారు. ఇంకొందరైతే నకిలీ టికెట్లు సృష్టించి, నట్టేట ముంచుతున్నారు. అవి నకిలీవని తెలియక తిరుమలకు వచ్చి క్యూలైన్‌లోకి వెళ్లాక తనిఖీల్లో పట్టుబడుతున్నారు. అటు డబ్బులు పోగొట్టుకుని, ఇటు శ్రీవారి దర్శనం లేక పోలీసుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. తిరుమల సమాచారం కోసం గూగుల్‌లో శోధిస్తే అనేక వెబ్‌సైట్లు దర్శనిమిస్తాయి. సైబర్ కేటుగాళ్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన సైట్లు సృష్టించి భక్తులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇటీవల తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆధ్వర్యంలో 30కి పైగా ఫేక్ వెబ్‌సైట్లను గుర్తించి, గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ నుంచి వాటిని తొలగించారు. కొండపైన ముఖ్యమైన సప్తగిరి, ఎస్వీ, శంఖుమిట్ట, అన్నమయ్య గెస్ట్‌హౌస్‌ల పేర్లతో 32 ఫేక్‌ వెబ్‌సైట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిలో 28 సైట్‌లను పూర్తిగా తొలగించడం గమనార్హం. ఈ క్రమంలో ఆ వెబ్‌సైట్‌ డొమైన్స్‌ నిర్వాహకులకు టీటీడీ అధికారులు లేఖలు రాశారు. ఇందులో గోడాడీ, ఎల్‌ఎల్‌సీ, హోస్టింజర్, హోస్టింజర్‌ ఆపరేషన్స్, యూఏబీ, ఇన్‌ టు నెట్‌వర్క్‌ ఐఎన్‌సీ, ఓన్‌ వెబ్‌ సొల్యూషన్‌ లిమిటెడ్, పబ్లిక్‌ డొమైన్‌ రిజిస్ట్రీ వంటివి ఉండటం గమనార్హం. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను టీటీడీ విజిలెన్స్ నియమించింది. తిరుమలలోని టీటీడీ ప్రధాన ఆఫీసులు, గదుల కేటాయింపు కేంద్రాల వద్ద దళారుల కదలికలపై విజిలెన్స్, పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవల కోసం భక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ సీవీఎస్‌వో కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కోసం మూడు నెలల ముందుగానే టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు జారీచేస్తుందని తెలిపారు. అలాగే, ఆఫ్‌లైన్‌లోనూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందొచ్చని, ఎటువంటి టిక్కెట్ లేకున్నా నేరుగా సర్వదర్శనం క్యూలైన్‌ ద్వారా దర్శించుకోవచ్చిన తెలిపారు. ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఇతర సైట్‌లకు వెళ్లి మోసపోవద్దని, గూగుల్‌లో ఏదైనా గెస్ట్‌హౌస్‌ పేరిట వెబ్‌సైట్‌ ఉందంటే అది నకిలీగా గుర్తించాలన్నారు. అంతేకాదు, వాట్సప్‌ కాల్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ పంపి, నగదు చెల్లించమంటే అంగీకరించవద్దని ఆయన అన్నారు. దళారులను గుర్తిస్తే వెంటనే విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 18004254141, విజిలెన్స్‌ వింగ్‌ 0877-2263828కు, లేదా 100కు డయల్ చేయాలని సూచించారు.