ఆసియాకప్‌ 2025 కోసం టీమిండియా జట్టు ఎంపిక ఆగస్టు 19న చేస్తారనే ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలో ఈ ఎంపిక జరగనుంది. అయితే గతంలో పోలిస్తే ఈసారి ఆటగాళ్ల ఎంపిక అనేది సంక్లిష్టంగా మారింది. ఇందుకు ప్రధానంగా పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత టీ20 టీమ్‌ పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిపోయింది. అవకాశం అందుకున్న వారంతా రాణించడంతో జట్టులో చోటు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా సీనియర్లు సైతం టీ20 జట్టులో చోటు ఆశిస్తుండటంతో పోటీ మరింత పెరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత టీ20 జట్టులో ఒకరకంగా ప్రక్షాళన జరిగిందనే చెప్పవచ్చు. రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం సహా బుమ్రా, సిరాజ్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. శుభ్‌మన్ గిల్, , కేఎల్ రాహుల్‌లను టీ20 టీమ్‌ నుంచి తప్పించారు. దీంతో వారంతా టీ20 జట్టుకు దూరమయ్యారు. ఈ సమయంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్ లాంటి వారు సెట్ అయిపోయారు. గత కొన్ని టీ20 సిరీస్‌లలో వీరంతా సమష్టిగా రాణించడంతో భారత్ విజయాలు సాధించింది. కానీ ద్వైపాక్షిక సిరీస్ అయితే.. ఈసారి కూడా యువ ఆటగాళ్లనే ఎంపిక చేసేవారు. కానీ జరగబోయేది ఆసియాకప్, అందులోనూ పాకిస్థాన్‌తో మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని సెలక్టర్లు భావిస్తున్నారట. సెప్టెంబర్ 14న భారత్, పాక్ మధ్య గ్రూప్‌ స్టేజ్‌లో మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత గ్రూప్‌-4, ఫైనల్‌లో మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇతర జట్లపై ఎలాంటి ప్రదర్శనా చేసిన ఫర్వాలేదు గానీ.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇది భావోద్వేగంతో కూడిన మ్యాచ్‌. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ను ఓడించే జట్టునే ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో జస్‌ప్రీత్ బుమ్రాను తప్పకుండా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో గిల్‌, శ్రేయస్ అయ్యర్‌పై కూడా సెలక్టర్లు ఫోకస్ చేశారు. ఇలా సీనియర్లు జట్టులోకి తీసుకోవాల్సి వస్తే మాత్రం ఇన్నాళ్లూ టీ20ల్లో సత్తాచాటిన పలువురు యువ ఆటగాళ్లపై వేటు పడుతుంది. మరి సెలక్టర్లు ఎవరెవరిని ఎంపిక చేస్తారు? ఎవరిపై కఠిన నిర్ణయం తీసుకుంటారు? అనేది తేలాల్సి ఉంది.