సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఆసియాకప్‌ 2025 కోసం క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఆదివారం ప్రకటించింది. అయితే సీనియర్ ప్లేయర్లు , మహమ్మద్ రిజ్వాన్‌లకు షాక్ ఇచ్చింది. వారు ఆడేందుకు ఆసక్తి చూపించినా.. జట్టులోకి మాత్రం ఎంపిక చేయలేదు. ఆసియాకప్‌కు ముందు పాకిస్థాన్, యూఏఈ, అఫ్ఘానిస్థాన్ జట్లు ట్రై సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్‌కు కూడా ఇదే 17 మంది ఆటగాళ్లను పీసీబీ కొనసాగించింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌ 2024లో పాకిస్థాన్ గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. దీంతో అప్పుడు జట్టులో ఉన్న బాబర్ అజామ్, మహమ్మద్‌ రిజ్వాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్నుంచి వీరిద్దరిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. టీ20 ఫార్మాట్‌కు దూరం పెట్టింది. ఇటీవల ముగిసిన విండీస్‌తో టీ20 సిరీస్‌కు సైతం వీరిని ఎంపిక చేయలేదు. దీంతో వీరిద్దరిని ఆసియాకప్‌కు ఎంపిక చేయరని ప్రచారం జరిగింది. తాజాగా ఆ వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిజం చేసింది. ఆసియాకప్‌తో పాటు, ట్రై సిరీస్‌లోనూ పాకిస్థాన్ జట్టును సల్మాన్‌ అలీ అఘా నడిపించనున్నాడు. బాబర్, రిజ్వాన్‌తో పాటు షాహీన్ అఫ్రిదీపై కూడా వేటు పడుతుందని భావించినా.. సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. మొత్తంగా టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పీసీబీ పెద్ద పీఠ వేసింది. రిజ్వాన్‌ ప్లేసులో మహ్మద్‌ హరీస్‌ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. ఫకర్‌ జమాన్‌, హరీస్‌ రవూఫ్‌, హసన్‌ అలీ లాంటి సీనియర్లు కూడా జట్టులో ఉన్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు యూఏఈ, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ యూఏఈ వేదికగా జరగనుంది. ఇది ముగిసిన వెంటనే ఆసియా కప్‌ 2025కి తెరలేవనుంది. ట్రై సిరీస్, ఆసియాకప్‌ కోసం పాక్‌ జట్టు:సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్‌, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహమ్మద్‌ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్‌ నవాజ్, మహమ్మద్‌ వాసిమ్ జూనియర్, షహిబ్‌జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్‌యాన్ మోకిమ్