ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌, దివ్యాంగ అనర్హుల ఫించన్‌లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన పింఛన్లకు సంబంధించిన వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో (లాగిన్‌లలో) ఉన్నాయి. సచివాలాయాలకు వరుసగా మూడు రోజులు (శుక్ర, శని, అదివారం) సెలవు కావడంతో.. నేటి నుంచి ఈ నెల 25లోపు వెల్ఫేర్ అసిస్టెంట్‌లు పింఛన్‌లను తొలగించినవారికి నోటీసులు అందించనున్నారు. అర్హులు ఉంటే తిరిగి అప్పిల్‌ చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు.హెల్త్ పెన్షన్‌ రూ.15వేలు తీసుకుంటున్నవారి ఇళ్లకు డాక్టర్లు వెళ్లి తనిఖీలు చేశారు. వారిలో 85శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి మంచానికి పరిమితమైనట్లు డాక్టర్ రిపోర్ట్ ఇచ్చినవారికి సెప్టెంబర్ నెల నుంచి రూ.15వేలు పింఛన్ ఇస్తారు. అలాగే తనిఖీల్లో 85శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి.. 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే వారిని పింఛన్ నుంచి వికలాంగ పింఛన్‌కు (రూ.. 15000 నుంచి రూ.6000) మార్చారు. 40శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారి వయసు 60 ఏళ్లు పైన ఉంటే వారికి రూ.15వేల నుంచి వృద్ధాప్య పింఛన్ రూ.4వేలకకు మార్చారు. 40శాతం కంటే వైకల్యం తక్కువ ఉండి 60 ఏళ్లు లేనివాళ్ల పింఛన్‌లు సెప్టెంబర్ నెల నుంచి ఆపేస్తారు.. వారికి డబ్బులు ఇవ్వరు. కూడా 40శాతంపైబడి ఉంటే వారికి రూ.6వేలు యథావిధిగా ఇస్తారు. వైకల్యం 40శాతం కటే తక్కువగా ఉన్న పింఛన్‌దారులకు 60 ఏళ్లు నిండితే వారికి వృద్ధాప్య పింఛన్‌గా మార్చి రూ.4వేలు ఇస్తారు. 40% కంటే తక్కువగా ఉండి 60 ఏళ్లు లేని వారి వికలాంగుల పింఛను సెప్టెంబర్‌ నెల నుంచి ఆపేస్తారు.. వారికి నోటీసులు ఇస్తారు. పింఛన్‌లు నిలిపివేసిన వారి వివరాలు సచివాయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే.. పాత సదరం సర్దిఫికెట్‌, సచివాలయ ఉద్యోగి ఇచ్చే నోటీసులు తీసుకెళ్లి జీజీహెచ్, ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లతో తనిఖీ వెరిఫై చేయించుకుని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్, మిగిలిన పత్రాలతో ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి.. నోటీసు ఇచ్చి 30 రోజుల లోపు మాత్రమే ఈ పని పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు కూడాఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై చాలా ఫిర్యాదులు అందాయి. పింఛన్ల పునఃపరిశీలనకు ఆదేశించింది.. పింఛన్లను తనిఖీ చేయించింది. పునఃపరిశీలనలో భాగంగా, ప్రభుత్వం లబ్ధిదారులకు ముందుగా నోటీసులు పంపింది. ప్రత్యేక సదరం క్యాంపులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని లబ్ధిదారులకు సూచించింది. అయితే, చాలా మంది అనర్హులు సదరం క్యాంపులకు హాజరు కాలేదు. కొంత అంగవైకల్యం ఉన్నవారు మాత్రం పరీక్షలకు వెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి, దివ్యాంగ శాతం వివరాలను సెర్ప్‌కు పంపించారు. తాజాగా ప్రభుత్వం అనర్హుల పింఛన్లు తొలగించే నిర్ణయం తీసుకుంది.