‘ఈసారి డబుల్‌ హౌస్‌.. డబుల్‌ డోస్‌.. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే’ అంటూ వస్తోంది తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు సీజన్-9తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా రాబోతున్న 'బిగ్‌బాస్ 9 తెలుగు' కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రోమోలతోనే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా.. ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న కంటెస్టెంట్స్ పేర్లు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ‘బిగ్‌బాస్‌’ సీజన్-9ని గత ఎనిమిది సీజన్ల కంటే భిన్నంగా, సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారు. ఈసారి సెలబ్రిటీలతో పాటు, సామాన్యులకు కూడా పెద్ద పీట వేయబోతున్నారు. కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేయడం కోసం 'అగ్ని పరీక్ష' అనే కొత్త కాన్సెప్ట్ ని నిర్వాహకులు తీసుకొచ్చారు. దాదాపు 100 మందిని ఎంపిక చేసి, వారిలో 40 మందిని ఫిల్టర్ చేసి, చివరకు 15 మందికి అగ్ని పరీక్ష పెడుతున్నారు. ఫైనల్ గా అందులో గెలిచిన 5 మందిని హౌస్ లోకి పంపించేలా ప్లాన్ చేశారు. మరోవైపు బిగ్ బాస్ లో పాల్గొనబోయే సెలబ్రిటీలు వీరేనంటూ కంటెస్టెంట్స్ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బిగ్‌ బాస్‌ - 9'లో ఎవరూ ఊహించని సెలబ్రిటీ ఒకరు కంటెస్టెంట్ గా రాబోతున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు.. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న దివ్వెల మాధురి. ఇప్పటికే రియాల్టీ షో నిర్వాహకులు ఆమెను స్పదించారని, ఆల్మోస్ట్ మాధురి ఎంట్రీ కన్ఫార్మ్ అయిందని టాక్ నడుస్తోంది. అయితే ఆమె ఒంటరిగా రావడం లేదని, తన రాజా దువ్వాడ శ్రీనివాస్ ని కూడా వెంటబెట్టుకొని జంటగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈసారి షో నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అనుకోవచ్చు.దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్, మాధురి బంధం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏపీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు, దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా వీరి సంబంధం తెరపైకి వచ్చింది. అప్పటి వరకూ సీక్రెట్ గా రిలేషన్ షిప్ కొనసాగించిన వీరిద్దరూ.. తమ బంధాన్ని పబ్లిక్ గా ప్రకటించి ఓపెన్ అప్ అయ్యారు. అప్పటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఏదొక విధంగా హాట్ టాపిక్ గా ఉంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ జంట 'బిగ్ బాస్' తెలుగు సీజన్-9లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 'బిగ్ బాస్ తెలుగు' గత సీజన్స్ లోనూ కొన్ని జోడీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో భార్యాభర్తలైన హీరో హీరోయిన్లు వరుణ్ సందేశ్ - వితిక షేరు.. సీజన్ 3లో హౌస్ లో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. అలానే రియల్ లైఫ్ కపుల్ రోహిత్ - మెరీనా అబ్రహం.. సీజన్ 6లో సందడి చేశారు. ఇప్పుడు 'బిగ్ బాస్ - 9'లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా హౌస్ లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.