ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. ఆ కేసులన్నీ ఎత్తేస్తున్న ఐటీ శాఖ.. త్వరలోనే ప్రకటన!

Wait 5 sec.

Income tax: ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేసి ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి అడ్డంకులు లేని సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా పన్నుల విషయంలో తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ట్యాక్స్ వివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)కి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.కేంద్ర ప్రభుత్వం 2024- 25 బడ్జెట్‌లో ప్రకటించిన పరిమితి కంటే తక్కువ మొత్తాలను కలిగి ఉన్న అన్ని శాఖాపరమైన పన్ను అప్పీళ్లను గుర్తించి, మూడు నెలల్లోపు వాటిని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచనలు ఇచ్చినట్లు సమాచారం. పన్ను పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడం, పన్ను చెల్లింపుదారులపై చట్టపరమైన భారాన్ని తగ్గించడానికి, న్యాయ వ్యవస్థపై అనవసరమైన వివాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచి పాలసీలు తీసుకురావడం ఒక్కటే సరిపోదు, వాటిని సరైన సమయంలో అమలు చేసినప్పుడే వాటి నిజమైన అర్థం తెలుస్తుంది అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) పరిమితిని రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పెంచారు. హైకోర్టుల పరిమితిని రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచారు. సుప్రీంకోర్టు పరిమితిని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచారు.ఈ కొత్త పరిమితులు అమలు చేసినప్పటి నుంచి 4605 అప్పీళ్లు ఉపసంహరించారు. 3120 కేసులలో అప్పీళ్లు దాఖలు చేయలేదు. అవి కొత్త పరిమితుల కంటే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల కోర్టులు అధిక విలువ కలిగిన కేసులపై దృష్టి పెట్టడానికి వీలు కలిగింది. ఇది వేగవంతమైన, మరింత సమర్థవంతమైన న్యాయ ప్రక్రియ అనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ఉంది. ఈ కేసుల్లో రూ. 10 లక్షల కోట్లకు పైగా వివాదాస్పద పన్ను డిమాండ్లు ఉన్నాయి. రంగాల వారీగా పనితీరును సమీక్షించాలని, పెండింగ్‌లో ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించాలని, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనేందుకు వ్యాజ్యాల మూలాలను విశ్లేషించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల విభాగం సీబీడీని కోరినట్లు సమాచారం.