ఎగువ ప్రాంతాలలో వర్షాలు.. నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహం.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..

Wait 5 sec.

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా పలు జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , విశాఖపట్నం జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాలోనూ ఆదివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని.. పాడుబడిన, శిథిలమైన గోడలు, భవనాల వద్ద నిల్చోవద్దని సూచించింది. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకటం, రోడ్డుపై నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో వాహనాలను నడపటం వంటివి చేయవద్దని సూచించింది. అలాగే వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే సోషల్ మీడియాలోని వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.మరోవైపు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, తుంగభద్ర, కృష్ణా నదులలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే ఇప్పటి వరకూ వరద ప్రవాహం హెచ్చరిక స్థాయిలకు చేరలేదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో తెలిపింది. అయినప్పటికీ ప్రాజెక్టుల వద్ద నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శనివారం 7 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 35.3 అడుగులు, ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 4.44 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపింది. తుంగభద్ర నదికి 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని, ప్రభావిత జిల్లాల్లోని మండల అధికారులను అప్రమత్తం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.మరోవైపు కోనసీమలో ప్రాంతంలోని నదులకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. వశిష్ట వైనితేయ, గౌతమీ నదీపాయల్లో నీటి ప్రవాహం పెరగటంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అటు ఏలూరు జిల్లా పోలవరం వద్ద కూడా గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలవరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ఈ కారణంగా అధికారులు రేడియల్ గేట్ల ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.