ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీనికి సంబంధించిన దస్త్రంపై సంతకాలు చేయడంతో.. సుగమమైంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. అధికారంలోకి వస్తే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో భాగంగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటోంది. దాదాపు పది సంవత్సరాలుగా ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది .. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కూడా దోహదపడుతుంది. షెడ్యూల్ విడుదల త్వరలో..ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈ పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ఒకటి లేదా రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు), స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు లభించనున్నాయి. ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 1.1 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సుమారు 12,000 నుండి 15,000 మంది ఉపాధ్యాయులు ఈ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎస్జీటీ కేడర్‌లోని చాలా మంది ఉపాధ్యాయులు, సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో కొనసాగుతూ.. ఎదురుచూశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జాప్యం, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ పదోన్నతులు ఆలస్యమయ్యాయి. ఈ పదోన్నతుల వల్ల కేవలం ఉపాధ్యాయుల వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా.. విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీ అవ్వడం వల్ల కొత్త ఉపాధ్యాయ నియామకాలకు కూడా మార్గం సుగమమవుతుంది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించే అంశంగా చెప్పకోవచ్చు. దీని ద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరి, విద్యార్థులకు మెరుగైన బోధన లభిస్తుంది. అలాగే.. ప్రధానోపాధ్యాయుల (Head Master) పోస్టులు భర్తీ అవ్వడం వల్ల పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది. ఇది రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఒక కీలక అడుగుగా భావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.