డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు మోదీ సర్కారును ఇబ్బంది పెట్టేలా ఉందని చెప్పొచ్చు. జన్మతః పౌరసత్వం రద్దు, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, దిగుమతులపై సుంకాలు విధించడం, పాకిస్థాన్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం.. ఇవన్నీ చూస్తుంటే మోదీ నా ఫ్రెండ్, భారత్ మా మిత్ర దేశం అని పదే పదే చెప్పే ట్రంప్.. ఇండియా వ్యతిరేక వైఖరితో ముందుకెళ్తున్నారేమో అనే భావన కలగక మానదు.స్వీయ ప్రయోజనాలే ముఖ్యం..గతంలో అప్ఘానిస్థాన్‌లోని తన అవసరాల కోసం పాకిస్థాన్‌ను చేరదీసిన అమెరికా.. కొంత కాలంగా చైనాను కట్టడి చేయడానికి భారత్‌కు స్నేహ హస్తం అందించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీతో ఆయనకు దోస్తీ కుదిరింది. ట్రంప్‌‌ ఎన్నికల్లో గెలవాలని మోదీ మద్దతుదారులు ఆకాంక్షించారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన అవసరాలు, తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం తప్పితే.. మిగతావేవీ తనకు ముఖ్యం కాదన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. యుద్ధం ఆపానని డబ్బా..ఆపరేషన్ సిందూర్‌ను అడ్డుకున్నానని.. అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికే 30 సార్లు చెప్పుకున్నారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ స్పష్టం చేశారు. అయినా సరే ట్రంప్ వైఖరి మారేలా కనిపించడం లేదు. తనకు నోబెల్ శాంతి పురస్కారం వచ్చేంత వరకు ఇలాంటి ప్రకటనలను ఆయన మానుకోరేమో. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అనూహ్యంగా పాకిస్థాన్‌ను దగ్గరకు తీయడం మొదలుపెట్టారు. ట్రంప్ ఫ్యామిలీ కంపెనీ పాకిస్థాన్‌తో క్రిప్టో కరెన్సీ విషయంలో ఒప్పందం జరిగింది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. ట్రంప్ ఆహ్వానం మేరకు . ఇప్పుడేమో పాకిస్థాన్‌ తీరంలో గుర్తించిన భారీ చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి ఇస్లామాబాద్‌తో తాము కలిసి పని చేస్తామని.. నంటూ ట్రంప్ వెటకారం ధ్వనించే రీతిలో మాట్లాడారు. రష్యాతో భారత్ స్నేహం నచ్చలేదు..ట్రంప్ భారత్‌తో బెదిరింపు ధోరణి కనబర్చడానికి చాలా కారణాలున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాతోపాటు పశ్చిమ దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంలో భారత్, చైనాల పట్ల పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా గతంలో భారత్‌ను హెచ్చరించింది. అయినా సరే మోదీ సర్కారు వెనక్కి తగ్గలేదు. తనతో దోస్తీ కోసం రష్యాను భారత్ పూర్తిగా పక్కనపెట్టాలని అమెరికా కోరుకుంటోంది. కానీ రష్యా మొదటి నుంచి మన మిత్రదేశం. దీంతో భారత్ ఈ రెండు దేశాలతోనూ స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది.ఇంతకు ముందు ప్రపంచంలో అమెరికా, యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రష్యా) రూపంలో రెండు బలమైన శక్తులు ఉండేవి. అప్పుడు కూడా భారత్ సామ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి మధ్యే మార్గంగా అలీన విధానంతో ఇతర దేశాలను కలుపుకొని పోయింది. ఇప్పుడు కూడా అమెరికా పక్షాన చేరడానికి లేదంటే చైనా వెనుక నడవడానికి భారత్ సిద్ధంగా లేదు. బహుళ ధ్రువ ప్రపంచం ఉండాలనేది భారత్ భావన. బ్రెజిల్, సౌతాఫ్రికాలపైనా ఒత్తిడి..భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌతాఫ్రికా తదితర దేశాల కలయికతో బ్రిక్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కూటమి తనకు వ్యతిరేకమని, డాలర్ ఆధిపత్యానికి గండికొట్టడానికి ఉద్దేశించిందని అమెరికా నమ్ముతోంది. అందుకే బ్రిక్స్ కూటమి పట్ల ట్రంప్ బెదిరింపు ధోరణితో వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రష్యా, చైనా ఎలాగో పూర్తిగా తన వ్యతిరేకం కాబట్టి.. భారత్, బ్రెజిల్, సౌతాఫ్రికాలను తనవైపు తిప్పుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకే ఇటు వస్తారా? లేదా అటు వెళ్తారా..? అన్న రీతిలో ఈ మూడు దేశాలపై టారిఫ్‌లు, వీసా ఆంక్షలు, నిధుల నిలిపివేత తదితర రూపాల్లో ఒత్తిడి పెంచుతోంది. బ్రిక్స్ అంటే భయం..సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తిగా అమెరికా అవతరించింది. కానీ ఇప్పుడు అమెరికా అగ్రరాజ్య హోదాను లాక్కునే దిశగా చైనా వేగంగా అడుగులేస్తోంది. భారత్ సహా ఇతర బ్రిక్స్ దేశాలు పూర్తిగా చైనా వైపు మొగ్గితే.. అమెరికా ఆధిపత్యానికి గండి పడటం ఖాయమే. తిరోగమనం దిశగా సాగుతున్న పశ్చిమ దేశాల కూటముల కంటే బ్రిక్స్ శక్తివంతమైన కూటమిగా మారే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఇంత కాలంపాటు భారత్‌ను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన అమెరికా.. బెదిరింపు ధోరణిలో ఇండియాను దారికి తెచ్చుకోవడం కోసం పాకిస్థాన్‌ను మళ్లీ దువ్వడం మొదలుపెట్టింది.భారీగా వాణిజ్య సుంకాలు విధిస్తామని బెదిరించడం, పాకిస్థాన్‌తో స్నేహం లాంటి పనులు చేస్తే.. భారత్‌ను భయపెట్టొచ్చని, తన దారికి తెచ్చుకోవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే భారత్‌పై 25 శాతం సుంకాల విధింపు ప్రకటన చేసిన వెంటనే పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రకటించడంతోపాటు.. ఆ దేశంలో గుర్తించిన భారీ చమురు నిక్షేపాల నుంచి చమురు వెలికి తీసేందుకు ఇస్లామాబాద్‌తో కలిసి పని చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అంటే భారత్‌ను బెదిరించడంతోపాటు పాకిస్థాన్‌లోని చమురు నిక్షేపాలు, ఖనిజ వనరులపైనా అమెరికా కన్నేసిందన్నమాట.జాతీయ ప్రయోజనాలకే మోదీ సర్కారు మొగ్గుభారత మార్కెట్లోకి తమ దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ మోదీ సర్కారు తమ జాతీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తోంది. అందుకే అమెరికా ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదు. ఎగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా.. అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భారత్ ఉంది. బ్రెజిల్, సౌతాఫ్రికా లాంటి దేశాలు కూడా ట్రంప్ టారిఫ్‌ల ఒత్తిడికి లొంగడం లేదు. అవసరమైతే అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించే యోచనలో బ్రెజిల్ ఉంది. అటో ఇటో తేల్చుకోవాల్సిందేనా..?అటు వైపు ఉంటారా..? ఇటు వైపు వస్తారా..? అన్న ధోరణిలో ట్రంప్ భారత్‌తోపాటు బ్రెజిల్, సౌతాఫ్రికాలపై ఒత్తిడి పెంచుతున్నారు. కానీ ఈ క్రమంలో ఆయనే భారత్‌ను చైనా, రష్యాలకు దగ్గర చేస్తున్నారు. 2030 నాటికి కచ్చితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్.. అటు అమెరికాతో, ఇటు చైనాతో స్నేహంగా మెలగడానికే ప్రాధాన్యం ఇస్తోంది. కానీ ట్రంప్ మాత్రం తన వైపు రావాల్సిందేననే పంతంతో ఉన్నారు. బెదిరింపులకు తలొంచడం, ఒకరికి వంతపాడటం అనేది ఇండియా డీఎన్‌ఏలోనే లేదనే విషయం ట్రంప్‌కు అర్థం కావడానికి మరికొంత సమయం పడుతుందంతే..! ఒకవేళ ట్రంప్ బెదిరింపులు బెడిసి కొట్టి భారత ఏనుగు, చైనా డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేసే పరిస్థితి వస్తే.. అమెరికాకు మ్యూజిక్కు మామూలుగా ఉండదు..!!