ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వచ్చాయి.. ఆయా జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. ఫార్మా, సోలార్ ప్యానళ్ల తయారీ, లైట్ బ్రిక్స్ ఇలా పలు కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భూముల్ని కేటాయించింది. ఏపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో లారస్‌ ఫార్మా జోన్‌ అభివృద్ధికి భూమిని కేటాయించింది. రాంబిల్లి ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఫేజ్‌-2లో 531.77 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమికి సంబంధించి.. ఎకరానికి రూ.30 లక్షల చొప్పున లారస్ సంస్థ సంస్థ చెల్లించనుంది. ఆ సంస్థ వివిధ దశల్లో రూ.5,600 కోట్ల పెట్టుబడులు.. 6,350 మందికి ఉపాధి కల్పించనుందని డీపీఆర్‌లో పేర్కొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు అనకాపల్లిలో జిల్లాలోనే మరో పరిశ్రమ ఏర్పాటుకానుంది. రాంబిల్లిలో ఆర్‌ఈ న్యూ సంస్థ 6 గిగావాట్ల సోలార్‌ ప్యానళ్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు వారికి ఆ సంస్థకు 135.96 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో రూ.3,700 కోట్ల పెట్టుబడులు.. 1,200 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా మరో కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఏఏసీ లైట్‌ బ్రిక్స్‌ తయారీ యూనిట్‌‌ను ఏర్పాటు చేసేందుకు వీఎస్‌ఆర్‌ సర్కన్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ వచ్చింది. రణస్థలం మండలం సాంచంలో ఈ సంస్థకు ఎకరానికి రూ.11.62 లక్షల చొప్పున 22.45 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కర్నూలు జిల్లాకు మరో సోలార్‌ ప్యానళ్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకానుంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.6,933 కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్ల సోలార్‌ సెల్, 5 గిగావాట్ల సోలార్‌ మాడ్యూళ్ల తయారీ యూనిట్‌ను అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో మొత్తం 2,138 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అనుమతించింది ప్రభుత్వం. మల్లవల్లి మెగా ఫుడ్‌ పార్క్‌లో అవిశా ఫుడ్స్‌ అండ్‌ ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 13.85 ఎకరాలు, మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 115.65 ఎకరాలను ఎకరం రూ.16.5 లక్షల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె దగ్గర ఏసీఈ ఇంటర్నేషనల్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ డెయిరీ ఉత్పత్తుల న్యూట్రిషన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు 75.63 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.1,000 కోట్ల పెట్టుబడులు.. 2 వేల మందికి ఉపాధి దక్కుతుందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అధిష్ఠాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ( బ్రాండిక్స్‌ ఇండియా అపరల్‌ సిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు) కేటాయించిన 695.35 ఎకరాల లీజు గడువును 25 ఏళ్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.