తెలంగాణను వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే కురుస్తున్నాయి. తాజాగా మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ అయింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా సముద్రంలోని వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తాయని హెచ్చరించింది.నేడు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తెలంగాణలో లోటు వర్షపాతంహైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ వానాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 29 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 33 రోజులు వర్షం పడగా, అత్యల్పంగా హైదరాబాద్, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో 14 నుండి 18 రోజులు మాత్రమే వర్షపాతం నమోదైంది. రాష్ట్ర సగటు వర్షపాతం 324.4 మి.మీ ఉండగా.. ఆదివారం నాటికి 324.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, జనగామ, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.