తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే ముందు లబ్ధిదారులు ఖర్చు పెట్టుకుంటే ఇంటి నిర్మాణం జరిగే వివిధ దశల్లో మెుత్తం 4 విడతలుగా రూ.5 లక్షల సాయం అందిస్తారు. అయితే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. పునాది స్థాయి వరకు నిర్మాణం పూర్తయితేనే మొదటి విడతగా రూ.లక్ష సాయం ప్రభుత్వం నుండి అందుతాయి. ఈ దశను చేరుకోవడానికి కూడా డబ్బులు లేక కొందరు నిరుపేదలు మంజూరు పత్రాలను వెనక్కి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిరుపేద లబ్ధిదారులకు డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి రూ. 1 లక్ష వరకు రుణం మంజూరు చేస్తున్నారు. ఈ రుణ సాయం రాష్ట్రంలోని పలు చోట్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఊతమిస్తోంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా మొత్తం 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే 1.74 లక్షల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలి విడత బిల్లు పొందడానికి కూడా ఆర్థిక స్థోమత లేని మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు బ్యాంకు లింకేజీ, సీఐఎఫ్‌, స్త్రీనిధి ద్వారా ఇంటి నిర్మాణానికి రూ. 1 లక్ష వరకు రుణం పొందవచ్చు. చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి రూ. 2 లక్షలు వరకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారు.ఈ రుణాలు పొందిన కొందరు లబ్ధిదారులు, అందుకున్న తర్వాత రుణభారాన్ని తగ్గించుకుంటున్నారు. చాలామంది 12 నుండి 24 వాయిదాల్లో రుణం చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారు. సంఘాల్లో పాత అప్పులు లేనివారు, డిఫాల్టర్లు కాని వారికి మాత్రమే బ్యాంకులు ఈ రుణాలు అందిస్తాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 12,038 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉండగా, రూ. 1 లక్ష రుణం పొందేందుకు 7,287 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. వీరిలో ఇప్పటికే 1,900 మందికి పైగా లబ్ధిదారులకు రూ. 22.83 కోట్లను రుణంగా అందించారు. మిగిలిన వారికి ఆగస్టు నెలాఖరు వరకు రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో 551 మందికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో 351 మందికి డ్వాక్రా రుణాలు అందజేశారు.మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 8,252 మంది లబ్ధిదారులు ఉండగా, రూ. 1 లక్ష రుణానికి 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 466 మందికి రుణం ఇవ్వాలని గుర్తించారు. వనపర్తి, నారాయణపేట జిల్లాలలో కూడా పలువురికి రుణాల మంజూరుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రుణ పథకం నిరుపేద లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది, తద్వారా రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.