India Won't Retaliate America: భారత్ తమకు మిత్ర దేశం అని చెబుతూనే.. 25 శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు కూడా విధించింది అమెరికా. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుండడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. ఈరోజు నుంచే ఆ సుంకాలు అమల్లోకి వస్తుండగా.. భారత సర్కారు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా టారిఫ్‌లు మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటాని స్పష్టం చేసింది. ట్రంప్ భారత్‌పై పెంచిన సుంకాలపై ఇండియా ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికారిక వర్గాల వెల్లడించాయి. మౌనమే దీనికి సరైన సమాధానం అని పేర్కొన్నాయి. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరిస్తామని వివరించాయి. కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక వర్గాలు వీటిని కొట్టి పడేశాయి. తొలిగా అణు పరీక్షలు చేసినప్పుడు కూడా మనపై ఇలాంటి ఆంక్షలే విధించారని గుర్తు చేశాయి. అయితే ఆ సమయంలో మనది చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని.. పరిష్కారాన్ని తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ కూడా పార్లమెంట్ వేదికగా తెలిపారు. భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని.. దేశ ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్లే..!మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతోనే తాను 25 శాతం సుంకాలు, పెనాల్టీలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగానే ఇరు దేశాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా . వారి ఆర్థిక వ్యవస్థను వారే మరింత పతనం చేసుకుంటుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా న్యూఢిల్లీతో తాము తక్కువ వ్యాపారం మాత్రమే చేస్తున్నట్లు వివరించారు. ఇక రష్యాతో ఎలాంటి వ్యాపారమూ చేయడం లేదని పూర్తి క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.