రోజురోజుకూ దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు చేయటం ఒక ఎత్తు అయితే... మనుషులు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేయడం మరొక ఎత్తు. ఇటీవలి కాలంలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోయాయి. అడ్రస్ కావాలనో, మంచి నీళ్లు ఇవ్వమనో ఇంటి వద్దకు వస్తారు.. ఆ వివరాలు అడుగుతూనే ఇంట్లో ఎవరైనా ఉన్నారేమోనని గమనిస్తారు.. ఎవరూ లేకపోతే ఇంట్లోకి చొరబడి బెదిరించి అందినకాడికి దోచుకుపోతారు. అలాంటి ఘటనే విశాఖపట్నంలో జరిగింది. ఓ గర్భిణిని ఇంట్లో బంధించి చోరీకి పాల్పడిందో మహిళ. గర్భిణి ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకుని ఉడాయించింది. విశాఖపట్నంలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు చెప్తున్న వివరాల ప్రకారం.. మధుశ్రీ అనే మహిళ భర్తతో కలిసి సీతంపేటలో నివశిస్తున్నారు. మధుశ్రీ ప్రస్తుతం గర్భవతి. దీంతో ఆమె భర్త ఎక్కడున్నా సరే ఫోన్ చేసి ఆమె బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఐదు రోజుల క్రితం మధుశ్రీ భర్త ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్లారు. ఇదే సమయంలో మధుశ్రీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. దీంతో ఎవరొచ్చారో చూద్దామంటూ మధుశ్రీ తలుపు తీసి చూశారు. అయితే అక్కడ ఎవరూ కనిపించలేదు. భ్రమ పడ్డానేమో అనుకుంటూ మధుశ్రీ ఇంట్లోకి వచ్చేలోపు.. ఓ ఆగంతకురాలు వేగంగా ఇంట్లోకి ప్రవేశించింది. గర్భిణీగా ఉన్న మధుశ్రీని కుర్చీలో కూర్చోపెట్టి.. రెండు చేతులు బలవంతంగా కట్టేసింది. ఆపై అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. మధుశ్రీ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయింది.అయితే మధుశ్రీ భర్త.. ఆమెకు ఫోన్ చేశాడు. ఎంతకూ ఫోన్ తీయకపోవటంతో ఇంటికి వచ్చి చూస్తే.. కుర్చీలో మధుశ్రీ కట్టేసి ఉంది. వెంటనే మధుశ్రీ, ఆమె భర్త కలిసి ద్వారకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాలుగున్నర తులాల బంగారం గొలుసు చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు సమీపంలోని సీసీ ఫుటేజీను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మహిళ ఆచూకీ తెలియలేదు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణిని బంధించి చోరీ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.