వాహనదారులకు అలర్ట్.. సర్వీస్ ఛార్జీలు పెంచిన రేవంత్ సర్కార్

Wait 5 sec.

తెలంగాణలో రవాణా శాఖ పలు రకాల సర్వీసు ఛార్జీలను భారీగా పెంచింది. ఈ కొత్త రుసుములు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ టెస్ట్‌లు, లైసెన్సుల జారీ, హైపోథికేషన్ తొలగింపు వంటి ఈ పెంపుతో వాహనదారులపై ఆర్థిక భారం పడనుంది. వాహనాల కొనుగోలుపై సర్వీసు ఛార్జీలు ద్విచక్ర వాహనాలకు గతంలో స్థిరంగా రూ. 200 ఉండగా... ఇప్పుడు వాహనం విలువపై 0.5 శాతంకు పెరిగింది. రూ. 1 లక్ష విలువైన బైక్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 లక్షల బైక్‌కు రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. కార్లకు గతంలో స్థిరంగా రూ. 400 ఉన్న సర్వీసు ఛార్జి, ఇప్పుడు వాహనం విలువపై 0.1 శాతంకు పెరిగింది. లెర్నర్ లైసెన్స్ (LLR) & డ్రైవింగ్ టెస్ట్ సర్వీసు ఛార్జి రూ. 100 చొప్పున పెరిగింది. గతంలో రూ. 335 ఉన్న లెర్నర్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ. 440కి చేరింది. టూవీలర్, కారు లెర్నర్ లైసెన్స్ ఫీజు రూ. 450 నుంచి రూ. 585కి పెరిగింది. డ్రైవింగ్ టెస్ట్ (మొత్తం ఫీజు) గతంలో రూ. 1035 ఉండగా.. ఇప్పుడు రూ. 1135కి పెరిగింది. ఆటో రిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ. 800 నుంచి రూ. 900కి పెరిగింది. వాహనాల ఫిట్‌నెస్ పరీక్ష రుసుము రూ. 700 నుంచి రూ. 800కి పెరిగింది. హైపోథికేషన్ తొలగింపు ఛార్జీలు కూడా భారీగా పెంచారు. గతంలో రూ. 650గా ఉన్న ఈ ఛార్జి రూ. 1900కి పెరిగింది. వాహన యాజమాన్య బదిలీ ఫీజు రూ. 935 నుంచి రూ. 1805కి పెరిగింది. వాహనాల ఆర్సీల కాలపరిమితి పునరుద్ధరణ, నేషనల్ పర్మిట్ల ఫీజులు కూడా పెరిగినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రోడ్ టాక్స్, క్వార్టర్లీ టాక్స్‌లలో మాత్రం ఎటువంటి మార్పులేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ పెంపునకు సంబంధించిన పూర్తి వివరాలు రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఛార్జీల పెంపు వాహనదారులపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపనుంది.