టీమిండియా యువ కెరటం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో తన పేరు వినిపించేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. 24 ఏళ్ల అభిషేక్ శర్మ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను అధిగమించి మరీ టీ20ల్లో టాప్ ప్లేస్‌కి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరం కావడంతో పాయింట్ల పరంగా అభిషేక్ శర్మ మెరుగు పరుచుకుని టాప్ ప్లేస్‌లోకి వెళ్లాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌కు 829 పాయింట్లు ఉండగా.. ట్రావిస్ హెడ్ 814 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌తో నిలిచాడు. అయితే ఈ ఇద్దరు బ్యాటర్లు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. జింబాబ్వేతో 2024లో జరిగిన సిరీస్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. తన రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచి టీమిండియాలో వెనక్కి తిరిగి చూసుకోకుండా జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టీ20ల్లోనే భారత జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన అభిషేక్ శర్మ.. 37 బంతుల్లో సెంచరీ చేసి సెకండ్ ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. జింబాబ్వే తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌లలోనూ అభిషేక్ శర్మ రాణించి ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండగా, ఆరో స్థానానికి పడిపోయాడు. టీ20ల్లో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్న మూడో భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇంతకు ముందు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనతను అందుకున్నారు. మొత్తానికి టీ20‌ల్లో ఓ కొత్త స్టార్ పుట్టాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.