క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంట్లో వాళ్లు వద్దన్నా కూడా ప్రేమించిన వాడితో మాట్లాడుతుందన్న కోపంతో ఏకంగా అక్కనే హత్య చేశాడో తమ్ముడు. ఆ తర్వాత తనకేం తెలియదు అన్నట్టు ఉండిపోయాడు. తండ్రికి అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి మొత్తానికి అరెస్ట్ చేశారు. కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన దేశాల రాఘవేందర్‌కు ఇద్దరు పిల్లలు. రుచిత, రోహిత్ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. రుచిత డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. రోహిత్ స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రుచిత పెంజర్లకు చెందిన ఈర్లపల్లి దినేశ్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరి ప్రేమ వ్యవహారం ఇళ్లల్లో తెలియడంతో మందలించారు. రుచిత తల్లిదండ్రలు అయితే గ్రామంలో పంచాయితీ పెట్టి దినేశ్‌కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులు హెచ్చరించినా, ఊరిలో పంచాయితీ పెట్టినా రుచిత మాత్రం దినేశ్‌తో మాట్లాడుతూనే ఉంది. ఈ క్రమంలో సోమవారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా.. ఇంట్లో రుచిత, ఆమె సోదరుడు రోహిత్ మాత్రమే ఉన్నారు. అదే సమయంలో దినేశ్‌తో రుచిత మాట్లాడటాన్ని రోహిత్ గమనించాడు. సోదరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. దాంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన రోహిత్ ఆమె గొంతుకు వైరు బిగించి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత రోహిత్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుమారుడిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. మంగళవారం టౌన్‌లోని పెంజర్ల క్రాస్ రోడ్డు వద్ద రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమైదన శైలిలో విచారణ చేయడంతో.. దినేశ్‌తో ఫోన్‌లో మాట్లాడుతుందనే కోపంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. అనంతరం దినేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.