స్పష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ బిడ్డ ఐవీఎఫ్ ద్వారా పుట్టలేదు.. ఏం జరిగిందంటే..

Wait 5 sec.

హైదరాబాద్‌లో సంచలనం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఈ కేంద్రంలో టెస్ట్ ట్యూబ్ బేబీ (ఐవీఎఫ్) పద్ధతి జరగలేదని.. బయట వేరొకరికి పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి, అద్దె గర్భం ద్వారా పుట్టారని నమ్మించి ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఈ దారుణ మోసం ద్వారా డాక్టర్ నమ్రత దంపతుల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఇది కేవలం వైద్య మోసం కాదని.. (చైల్డ్ ట్రాఫికింగ్) అని పోలీసులు పేర్కొన్నారు. రాజస్థాన్ జంట ఫిర్యాదుతో వెలుగులోకి..ఈ కేసు వివరాలను నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. గోపాలపురంకు చెందిన ఒక జంట ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై రైడ్ చేశామని డీసీపీ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన ఒక దంపతులు ఆన్‌లైన్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి తెలుసుకుని డాక్టర్ నమ్రతను సంప్రదించారు. సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లలు పుట్టించడానికి రూ.30 లక్షలు అవుతుందని నమ్రత వారికి చెప్పింది. దీంతో దంపతులు విజయవాడ వెళ్లి, అక్కడ తమ శాంపిల్స్ ఇచ్చారు. సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని డాక్టర్ వారికి నమ్మబలికింది. కొన్ని నెలల తర్వాత బాబు పుట్టాడని ఆ జంటకు డాక్టర్ నమ్రత చెప్పింది. సిజేరియన్ ద్వారా డెలివరీ అయిందని అబద్ధం చెప్పి.. అదనంగా మరో రూ.10 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తం రూ.40 లక్షలు దంపతుల నుంచి లాగేసింది. అయితే.. కొన్ని నెలల తర్వాత ఆ బాబు పోలికలు ఆ దంపతులకు అనుమానాస్పదంగా అనిపించాయి. దీంతో వారు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని డాక్టర్‌ను కోరారు. ఇందుకు నమ్రత అస్సలు ఒప్పుకోలేదు. దాంతో దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. ఆ పరీక్షలో ఆ బిడ్డ తమకు చెందినది కాదని.. మరొకరి డీఎన్‌ఏగా తేలడంతో దంపతులు డాక్టర్ నమ్రతను నిలదీశారు. అయితే.. నమ్రత తన కొడుకు జయంత్ కృష్ణతో కలిసి బాధితులను బెదిరింపులకు పాల్పడింది. జయంత్ కృష్ణ తాను న్యాయవాదినని చెప్పుకొని బెదిరించాడు. బిడ్డల అక్రమ రవాణా.. డాక్టర్ నమ్రత చేసింది నిజానికి సరోగసి కాదు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి, సరోగసి ద్వారా మీకు పుట్టిన బిడ్డ అని దంపతులను నమ్మించింది. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని ఫ్లైట్‌లో వైజాగ్ తీసుకొచ్చి, అక్కడ డెలివరీ చేసి, ఆమెకు పుట్టిన బిడ్డను ఆ రాజస్థాన్ దంపతులకు ఇచ్చింది. బిడ్డను వద్దనుకున్న ఆ మహిళకు రూ.90 వేలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు సరైన అనుమతులు లేవని, ఆ ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు 2021లోనే గడువు తీరిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. హైదరాబాద్ DM & HO వెంకట్ కూడా ఈ రైడ్‌లో పాలుపంచుకుని.. 2020లోనే వారి అనుమతులు ముగిశాయని, ఆసుపత్రి మూసేస్తున్నామని వారు చెప్పారని.. క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని చెప్పారు. అయినా అక్రమంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను నడుపుతున్నారని ఆయన అన్నారు. సెంటర్‌లో థియేటర్, అనస్థీషియా ల్యాబ్, బెడ్స్, 7 రకాల అనాలసిస్ చేసే ఎక్విప్‌మెంట్ ఉన్నాయని, డస్ట్ బిన్ చెక్ చేస్తే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. డాక్టర్ నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు ఉన్నాయని, ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా చాలా మందికి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు.