తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యంగా నేడు ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, మెదక్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 7 సెంటీమీటర్లు, ఇల్లెందులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 520 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు.భద్రాచలం వద్ద గోదావరి ఉధృతితెలంగాణలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా మళ్లీ పెరిగింది. శనివారం ఉదయం 7 గంటల నాటికి గోదావరి నీటిమట్టం 32.5 అడుగులను దాటింది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలంలోని స్నాన ఘట్టాల వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువనుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పర్యాటక ప్రాంతానికి చెందిన నారచీరల ప్రాంతం వద్ద వరద నీరు చేరడంతో సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు, పర్యాటకుల భద్రత దృష్ట్యా భద్రాచలంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇటు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు ప్రవేశించకుండా స్లూయిజ్‌ల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.