తెలంగాణలో వర్షాలపై హైదారాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో పగటిపూట మేఘాలు, ఎండతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మోతాదులో జల్లులు పడే ఛాన్స్ ఉందని అన్నారు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలకు అవకాశం లేదని అన్నారు. అరేబియా సముద్రంలో శ్రీలంకకు దిగువన ఏర్పడిన ఆవర్తనం జులై 31 లేదా ఆగస్టు 1 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో అరేబియా సముద్రంలో కదలికలు పెరిగి వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్పపీడనం ఏ దిశగా కదులుతుందనే దానిపై దాని ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాబోయే మూడు రోజుల పాటు దక్షిణ భారతదేశం అంతటా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. దీంతో పాటు, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, దక్షిణ మహారాష్ట్రలో వారం రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం నుంచి ఉత్తరానికి గాలులు వీస్తున్నాయని.. తెలంగాణలో గంటకు 15 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రత 29 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పారు. వేడి గాలులు తిరిగి ఎండా కాలాన్ని గుర్తు చేస్తాయన్నారు. మెుత్తంగా వారం పాటు రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం లేదని అన్నారు. ఇక ఇటీవల పది రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లను జులైలోనే ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. సాగర్ గేట్లు ఎత్తటంతో పర్యాటకులు అక్కడికి క్యూ కడుతున్నారు.