విశాఖలో TCSకు 99 పైసలకే 21.16 ఎకరాలు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖపట్నంలో టీసీఎస్‌కు భూముల కేటాయింపుపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదని.. కంపెనీల రాకతో రాష్ట్రానికి కలిగే లాభాలను పరిశీలించాలని సూచించింది. విశాఖలో TCS కు భూమి కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని హైకోర్టు తెలిపింది. టీసీఎస్‌‌నుఆకర్షించడానికి ప్రభుత్వం తక్కువ ధరకే భూమిని ఇచ్చి ఉండొచ్చని.. ఎంత ధరకు ఇస్తున్నారనేది కాదు, ఆ సంస్థ రావడం వల్ల రాష్ట్రానికి ఎంత లాభం జరుగుతుందో చూడాలని సూచించింది. టీసీఎస్ రూ.1370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోందని.. హైదరాబాద్, బెంగళూరు ఐటీతో ఎలా అభివృద్ధి చెందాయో అందరికి తెలుసని హైకోర్టు అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న సమయంలో పెట్టుబడులు చాలా ముఖ్యమని.. టీసీఎస్‌ వంటి పెద్ద సంస్థలు వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థికంగా కూడా ఎదుగుదల ఉంటుంది.. అందుకే ప్రభుత్వం తక్కువ ధరకే భూమిని కేటాయించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ధర ఎంత అనే దానికంటే, సంస్థ రావడం వల్ల కలిగే లాభం ముఖ్యం అని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా గమనిస్తే వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు కంపెనీలకు, సంస్థలకు నామమాత్రపు ధరకు భూమితో పాటుగా వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. టీసీఎస్ రాకతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దామంది. రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని లీజుకు ఇస్తోందని ప్రభుత్వ ప్రత్యేక తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. భూమి అమ్మడం లేదన్న విషయాన్ని గమనించాలని.. భూమిని అమ్మేస్తున్నట్లుగా పిటిషనర్ చేస్తున్న వాదనలో నిజం లేదని కోర్టుకు వివరించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 21న విశాఖపట్నంలో TCSకు 21.16 ఎకరాల భూమిని కేవలం రూ.0.99 పైసలకే కేటాయించింది. TCS కంపెనీకి తక్కువ ధరకు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రైట్స్‌ (ఎస్‌పీసీపీఈఆర్‌) అధ్యక్షుడు నక్కా నమ్మి ఈ పిటిషన్ వేశారు. రూ.529 కోట్ల విలువైన స్థలాన్ని TCSకు తక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.