తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ నుంచి కానుకలు, టికెట్లు బుక్ చేస్కోండి!

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు, మహిళలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఆగస్టు 8న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు జేఈవో వీర‌బ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 'వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలి. శుక్రవారం ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి పాల్గొనవచ్చు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ ద‌ర్శనం, ఊంజల్‌సేవలను టీటీడీ రద్దు చేస్తున్నాము' అని తెలిపారు జేఈవో వీరబ్రహ్మం. ఈ టికెట్లను టీటీడీ ఈ నెల 31న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లోనూ విడుదల చేయనుంది.. భక్తులు బుక్ చేసుకోవచ్చు.'గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలి. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలి. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలి. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షిణీయంగా, ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలి. స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలి' అని సూచించారు. 'వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఆలయ పరిసరాలలో పెండాల్స్, సూచిక బోర్డులు, ఎల్.ఈ.డీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలి. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలి. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాటు చేపట్టాలి' అన్నారు. 'పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస చార్యులు, బాబు స్వామి, మణికంఠ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో పి. హరింద్రనాథ్, ఎస్.ఈ (ఎలక్ట్రికల్) వేంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈవో సెల్వం, విజీవో సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.