మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ అలసత్వం కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం కలిగించే పరిస్థితికి దారితీస్తోంది. డయాగ్నస్టిక్ పరీక్షల ఖర్చులు అధికంగా ఉండటం, సమయాభావం, అవగాహన లోపం వంటివి ప్రజలు పరీక్షలు చేయించుకోకపోవడానికి ప్రధాన కారణాలు. 'డయాగ్నస్టిక్ ఫీజులు ఎక్కువ, ఆసుపత్రికి వెళ్లడానికి టైం లేదు' వంటి సాకులు చెప్పి చాలామంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. అయితే, ఈ నిర్లక్ష్యం వల్ల బీపీ వంటి వ్యాధులు ప్రారంభ దశలో గుర్తించకపోవటంతో తీవ్రమైన దశకు చేరుకుంటున్నాయి.మారిన జీవనశైలితో బీపీ, షుగర్ వంటి వ్యాధులు సర్వసాధారణమవుతున్న నేపథ్యంలో సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల క్రితం కార్డియాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) ఆధ్వర్యంలో (MGBS)లోని 30వ ప్లాట్‌ఫాం సమీపంలో ఒక బీపీ చెకింగ్ కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎవరైనా ఈ యంత్రాన్ని ఉపయోగించి తమ రక్తపోటును సులభంగా చేసుకోవచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అక్కడ ఏర్పాటు చేసిన యంత్రం లోపల చేయి పెట్టి పక్కన ఉన్న బటన్ నొక్కితే క్షణాల్లో బీపీ (సిస్టోలిక్, డయాస్టోలిక్) రీడింగ్‌తో పాటు గుండె కొట్టుకునే వేగం (పల్స్ రేట్) కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఎంజీబీఎస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంది. అయితే సరైన అవగాహన ప్రచారం లేకపోటవంతో చాలా మంది దాన్ని వినియోగించుకోవటం లేదు. ఇక బీపీని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును ముందుగానే గుర్తించి, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా బస్ స్టేషన్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో, ప్రజలు ప్రయాణ అలసటతో ఉన్నప్పుడు లేదా సాధారణంగా తమ ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. దురదృష్టవశాత్తు, ఈ కియోస్క్ ఏర్పాటు వెనుక ఉన్న సదుద్దేశం ప్రచార లోపం కారణంగా నెరవేరడం లేదు. బస్ స్టేషన్ సిబ్బంది ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ కియోస్క్‌ను ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోగలుగుతారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు ఈ సౌకర్యం మరింత దోహదపడుతుంది.