: మన దేశంలో ఐటీ ఉద్యోగాలకు ఒకప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఐటీ జాబ్ అంటే లైఫ్ సెట్టే అన్న భావన ఉండేది. ఇంకా.. పెళ్లిళ్ల కోసం కూడా ఎక్కువగా ఐటీ జాబ్ ఉందా లేదా అని చూసేవారే ఎక్కువగా ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత కొంత కాలంగా ఐటీకి డిమాండ్ తగ్గిపోయింది. కరోనా సమయంలోనూ ఐటీ కంపెనీలు అద్భుతంగా రాణించగా.. అదే సమయంలో డిమాండ్‌కు మించి ఉద్యోగుల్ని తీసుకోగా.. తర్వాత క్రమక్రమంగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇలా చేశాయి. ఇదే సమయంలో అమెరికాలో తిరిగి అధికారంలోకి వచ్చాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇది ఐటీని గట్టి దెబ్బకొట్టింది. ఈ క్రమంలోనే చాలా వరకు ఐటీ సంస్థలు గత సంవత్సరం వ్యవధిలో చాలా వరకు ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. ఇంకా వాటి లాభాలు, ఆదాయం కూడా పడిపోతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను టెస్టుల్లో ఫెయిల్ అయ్యారన్న కారణంతో వరుసగా వందల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది టీసీఎస్‌కు పాకింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా 12,261 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో మార్పుల కారణంగానే తొలగింపులు చేపట్టాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీలకు సంబంధించి సిబ్బందికి నూతన సాంకేతికతల్లో శిక్షణ కూడా ఇస్తున్నామని.. ఇక ప్రత్యామ్నాయం కల్పించలేని పరిస్థితుల్లోనే దాదాపు 12 వేల మందిని తొలగించాల్సి వస్తున్నట్లు కృతివాసన్ పేర్కొన్నారు. సంస్థలోని మొత్తం 6,13,069 మంది ఉద్యోగుల్లో వీరు 2 శాతానికి సమానం. కంపెనీ తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటని చెప్పారు. టీసీఎస్ నుంచి ఇలా వచ్చిన షాకింగ్ ప్రకటనతో.. సోమవారం రోజు షేరు ధర భారీగా పతనం అవుతోంది. గత శుక్రవారం సెషన్‌లో టీసీఎస్ షేరు రూ. 3,135.80 వద్ద ముగియగా.. ఇవాళ దాదాపు ఒక శాతం నష్టంతో రూ. 3110 వద్ద ఓపెన్ అయింది. ఇంకా తగ్గి ఇంట్రాడేలో దాదాపు 2 శాతం పతనంతో రూ. 3,081.60 కి తగ్గింది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో చూస్తే స్టాక్ ధర రూ. 3,103 వద్ద ఉంది. ఇక టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 11.23 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 4,592.25 గా ఉండగా.. కనిష్ట ధర రూ. 3,056.05 వద్ద ఉంది. ఇక గత 5 రోజులు, నెల, 6 నెలలు, సంవత్సరం వ్యవధిలో ఇలా స్టాక్ పతనం అవుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు.