భరద్వాజ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై నెటిజన్లు తరచుగా ట్రోల్ చేస్తుంటారు. ఇద్దరు బిడ్డల తల్లి కురచ దుస్తులు, ఇతర గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవడం ఏంటని విమర్శిస్తుంటారు. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ పై అనసూయ తాజాగా స్పందించారు. తల్లి అయితే మనల్ని మనం వదిలేసుకోవాలా? అని ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ లెటర్ షేర్ చేశారు. బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదని, తనకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవడం వల్ల తన విలువలు కోల్పోయానని అర్థం కాదని పేర్కొన్నారు. ''నన్ను ఎవరైనా విమర్శించినా నేను చాలా వరకూ సైలెంట్‌గా ఉంటున్నాను. కానీ నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవన శైలినే విమర్శిస్తుంటే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అందులో మహిళలే నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారెవరో నాకు తెలియదు. నేను వారికి తెలియదు. అయినా సరే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు''''అవును.. నేను ఒక మహిళను, భార్యను, ఇద్దరు పిల్లల తల్లిని. నా స్టైల్, గ్లామర్, ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డ్రెస్సులు ధరించడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఇలా కనిపించడం నాకు నచ్చుతుంది. కానీ కొంతమంది నేను ఓ తల్లిగా ప్రవర్తించడం లేదని అంటున్నారు. కానీ నేను వారిని ఒక్క ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. తల్లి అయ్యాక మన నిజమైన స్వరూపాన్ని వదిలేయాలా?''''నా ఫ్యామిలీ, భర్త, పిల్లలు నేను ఎలా ఉన్నా నన్ను అంగీకరిస్తారు, ప్రేమిస్తారు. నన్ను వారు జడ్జ్‌ చేయరు. నాకు సపోర్ట్‌ చేస్తారు. అది చాలు. ఇంత ఓపెన్‌గా ఉండడం కొంతమందికి కొత్తగా అనిపించొచ్చు. అయినా పర్లేదు. కానీ ఒకరి ఛాయిస్ ని చెడు ప్రభావంగా చూడకండి. నా పిల్లలు నన్ను గౌరవంతో, బాధ్యత కలిగిన మహిళగా చూస్తున్నారు. బోల్డ్‌గా ఉండటం అంటే అగౌరవంగా ఉండటం కాదని నేను నమ్ముతాను. నాకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవడం వల్ల నేను నా విలువలు కోల్పోయానని అర్థం కాదు'' ''ఎవరైనా నన్ను ఉదాహరణగా తీసుకొని నన్ను ఫాలో అవ్వమని నేను అనడం లేదు. ఇదొక్కటే మార్గమని కూడా నేను చెప్పడం లేదు. మీరు మీ స్టైల్‌లో బ్రతికినట్టే, నేను నా జీవితాన్ని నా స్టైల్‌లో బ్రతికే హక్కు కోరుతున్నాను. మీ అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను. మీరు కూడా ఇతరుల జీవిత విధానాన్ని గౌరవించాలని ఆశిస్తున్నాను. మన మధ్య వ్యత్యాసాలను విమర్శలు లేకుండా అంగీకరించగలిగితే, మనం అందరం శాంతియుతంగా కలసి ఉండగలుగుతాం. నేను ప్రేమతో, ధైర్యంగా, స్వేచ్ఛతో బ్రతుకుతాను. అదే సమయంలో ఇతరుల్ని గౌరవించడాన్ని మర్చిపోను'' అని అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.