మాంచెస్టర్ టెస్ట్ చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌ నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లు ఒకే సెషన్‌లో ఔట్ అయ్యారు. తొలుత 188 పరుగుల వద్ద అయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన అద్భుతమైన బంతికి.. కేఎల్ రాహుల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో శతకానికి 10 రన్స్ దూరంలో అతడు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరికాసేపట్లో సెషన్ ముగిస్తుందనగా సెంచరీ హీరో గిల్.. క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సరికి భారత్.. 223/4తో నిలిచింది.ఓవర్‌నైట్ స్కోరు 174/2తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. తొలి అర్ధగంటలో వికెట్ కోల్పోలేదు. రాహుల్, గిల్ సంయమనంతో బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు బౌలింగ్‌ చేయని కెప్టెన్ బెన్ స్టోక్స్.. బంతి అందుకున్నాడు. అద్భుతమైన డెలివరీతో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో 90 పరుగులు చేసిన అనంతరం అతడు ఔట్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. గతంలో కొత్త బాల్‌ను ఎదుర్కొన్న అనుభవాన్ని మొత్తం ఉపయోగించి క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు.నాలుగో రోజు హాఫ్ సెంచరీ చేసిన గిల్.. ఐదో రోజు ఆటలో సెంచరీ సాధించాడు. అయితే కాసేపటికే ఔట్ అయ్యాడు. మరికాసేపట్లో తొలి సెషన్ ముగుస్తుందనగా.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జెమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.. తొలి బంతికే ఔట్ అయ్యే వాడు. అతడు ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జో రూట్ మిస్ చేశాడు. దీంతో జడ్డూ లక్కీగా ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.తొలి సెషన్ ముగిసే సరికి భారత్.. 4 వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ కంటే ఇంకా.. 88 రన్స్ వెనుకంజలో ఉంది. ఐదో రోజు ఇంకా 64 ఓవర్ల ఆట మిగిసి ఉంది. ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవాలంటే.. కనీసం 50కి పైగా ఓవర్లలో భారత్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.