తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ ప్రత్యేక ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డుల్లో పేరు నమోదైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కొత్తగా అర్హత సాధించిన లక్షలాది మందికి ఆర్థికంగా ఎంతో ఆదుకుంటుంది. ఈ ఏడాది జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 2.81 కోట్ల మంది సభ్యులుగా నమోదయ్యారు. వీరందరూ ఇప్పటికే ఆరోగ్యశ్రీ పోర్టల్‌తో అనుసంధానమై ఉన్నారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారికి కూడా ఈ సౌకర్యం అందుతుంది. వీరందరికీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులలో నిబంధనల ప్రకారం.. చికిత్సలు పొందే అవకాశం ఉంటుంది. జనవరి 26 నుండి మొదలైంది. ఇప్పటివరకు సుమారు 6 లక్షల కంటే ఎక్కువ కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95,56,625కు పెరిగింది. ఈ కొత్త కార్డుల్లో 3.10 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. కొత్తగా చేరిన ఈ 30 లక్షల మంది అర్హుల వివరాలను ఆరోగ్యశ్రీ పోర్టల్‌లోకి నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలను వేగవంతం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య సేవల బిల్లుల కింద ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1,590 కోట్లకు పైగా చెల్లించింది. సగటున 22 శాతం మేర చికిత్స ఖర్చులు పెరగడంతో పాటు.. ప్రతి నెలా ఆస్పత్రులకు బిల్లుల కింద రూ.100 కోట్ల వరకు చెల్లిస్తుండటంతో.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరడానికి ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఆసక్తి చూపుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 461 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు ప్రజలకు.. ముఖ్యంగా కొత్తగా అర్హత పొందిన వారికి, మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆర్థిక భారాన్ని తగ్గించాయి. కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన పథకాలకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.